KL Rahul: 'ఆ రోజు కేఎల్ రాహుల్ తీవ్ర కోపంలో ఉన్నాడు'.. షాకింగ్ విషయం బయటపెట్టిన వసీం జాఫర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మైదానంలోనూ, బయటా ప్రశాంత స్వభావంతో ఉండే ఆటగాడిగా పేరొందాడు. వివాదాలకు దూరంగా ఉండే అతడు, ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీలకు కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ ఒత్తిడితో కూడిన మ్యాచ్ల్లో కూడా తన ప్రశాంతతను కోల్పోకుండా కనిపిస్తాడు. ఆటగాళ్లు తప్పులు చేసినా వారితో సౌమ్యంగా మాట్లాడే రాహుల్, ఒకసారి మాత్రం తీవ్ర అసహనానికి గురయ్యాడని పంజాబ్ కింగ్స్ మాజీ హెడ్ కోచ్ వసీం జాఫర్ వెల్లడించాడు. 2018 నుంచి 2021 వరకు కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ (PBKS) తరఫున ఆడటంతో పాటు జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. అదే సమయంలో వసీం జాఫర్ పంజాబ్కు హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు.
వివరాలు
కేఎల్ రాహుల్ సహజంగానే చాలా ప్రశాంతంగా ఉంటాడు
జాఫర్ మాట్లాడుతూ 2020, 2021 ఐపీఎల్ సీజన్లలో రాహుల్ వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, జట్టు మాత్రం ఆరో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశాడు.
చాలా మ్యాచ్ల్లో గెలిచే స్థితిలో ఉండి కూడా చివరి క్షణాల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలవడం రాహుల్ను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు.
కేఎల్ రాహుల్ సహజంగానే చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతడు మితభాషి. ఎవరితోనూ ఎక్కువగా కలవడు. అందుకే బయట కూడా పెద్దగా కనిపించడు.
మైదానంలో గానీ, బయట గానీ అతడు సహనం కోల్పోవడం, కోపం చూపించడం చాలా అరుదని జాఫర్ చెప్పాడు.
వివరాలు
గెలవాల్సిన ఎన్నో మ్యాచ్లను చివర్లో చేజార్చుకున్నాం.
అయితే తాను పంజాబ్ జట్టుకు కోచ్గా ఉన్న సమయంలో జరిగిన ఒక మ్యాచ్ తర్వాత మాత్రం రాహుల్ తీవ్ర అసహనానికి గురయ్యాడని వెల్లడించాడు.
ప్రతి మ్యాచ్ మాకు తీవ్ర నిరాశనే మిగిల్చేది. గెలవాల్సిన ఎన్నో మ్యాచ్లను చివర్లో చేజార్చుకున్నాం. అలాంటి ఒక మ్యాచ్లో సునాయాసంగా గెలవాల్సిన విజయాన్ని కోల్పోవడంతో రాహుల్కు కోపం వచ్చింది.
అయితే అతడు ఎవరినీ తప్పుగా మాట్లాడలేదు. జట్టు ఆటతీరుపై ఎంత అసంతృప్తిగా ఉన్నాడో మాత్రమే స్పష్టంగా కనిపించింది. నేను రాహుల్ను కోపంగా చూసిన ఏకైక సందర్భం అదేనని వసీం జాఫర్ వివరించాడు.