Lionel Messi: మెస్సి పర్యటన వివాదం: టీఎంసీపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానన్న ప్రమోటర్
ఈ వార్తాకథనం ఏంటి
తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని మెస్సి పర్యటన నిర్వాహకుడు శతద్రు దత్తా హెచ్చరించారు. గత సంవత్సరం మెస్సి భారత పర్యటన సందర్భంగా కోల్కతా స్టేడియంలో జరిగిన ఘటనల కారణంగా తాను అన్యాయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉండటంతో తాను జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి పాలైన తర్వాత శతద్రు సామాజిక మాధ్యమాల్లో వరుసగా స్పందిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
వివరాలు
బెంగాల్ క్రీడాశాఖ మంత్రిపై తీవ్ర విమర్శలు
సాల్ట్లేక్లో జరిగిన ఘటన తర్వాత టీఎంసీ తన మూడేళ్ల శ్రమను వృథా చేసి, తన ప్రతిష్టను దెబ్బతీసిందని శతద్రు ఆరోపించారు. 'ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మీకు శిక్ష పూర్తయిందని అనుకోకండి. నేను మీపై పరువు నష్టం కేసు వేస్తాను. అవసరమైతే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లి చివరివరకు పోరాడతాను' అని స్పష్టం చేశారు. బెంగాల్ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిస్వాస్పై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి, ఆయనతో వచ్చినవారు ఆటగాడి చుట్టూ గుమిగూడటమే ప్రేక్షకుల్లో ఆగ్రహానికి కారణమైందన్నారు. స్టేడియంలో ఫోటోలు తీయవద్దని పలుమార్లు చెప్పినా, మంత్రి అధికారాన్ని వినియోగించి ఫోటోలు తీసినట్టు ఆరోపించారు. దీనికి ఆయన తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.
వివరాలు
'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'
త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. గత సంవత్సరం నిర్వహించిన 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సి ముందుగా కోల్కతాకు చేరుకున్నాడు. అక్కడ సాల్ట్లేక్ స్టేడియంలో అభిమానులు ఆశించిన సమయానికి తక్కువసేపు గడపడంతో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనపై పోలీసులు ఈవెంట్ నిర్వాహకుడు శతద్రుతో పాటు మరికొందరిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన శతద్రు 37 రోజులు జైలులో గడిపాడు.