T20 World Cup 2026: అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ మ్యాచ్లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మ్యాచ్ అఫీషియల్స్ వివరాలను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 24మంది ఫీల్డ్ అంపైర్లు,ఆరు మంది మ్యాచ్ రిఫరీలు ఉన్నారు. అయితే సూపర్-8 దశతో పాటు నాకౌట్ మ్యాచ్లకు నియమించే అఫీషియల్స్ వివరాలను ఐసీసీ తర్వాత వెల్లడించనుంది. కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరిగే టోర్నీ తొలి మ్యాచ్కు కుమార్ ధర్మసేన, వేన్ నైట్స్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్తో వేన్ నైట్స్ టీ20 ప్రపంచకప్ అంపైరింగ్లో అడుగుపెట్టనున్నాడు. అంతేకాదు,ఇదే మ్యాచ్ అతడికి 50వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ను అంపైర్గా నిలిచే ప్రత్యేక సందర్భంగా నిలవనుంది.
వివరాలు
అంపైర్ల జాబితాలో నితిన్ మీనన్, రిఫరీగా జవగళ్ శ్రీనాథ్కు చోటు
ఇక ధర్మసేన గతంలో 2016, 2022 ఫైనల్స్ సహా పలు కీలక మ్యాచ్లకు అంపైరింగ్ చేసి అనుభవం సంపాదించాడు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఈ హై వోల్టేజ్ పోరుకు రిచర్డ్ ఇల్లింగ్వర్త్, కుమార్ ధర్మసేన అంపైర్లుగా వ్యవహరించనున్నారు. అలాగే ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో భారత్ ఆడే మ్యాచ్కు పాల్ రీఫిల్, రాడ్ టక్కర్ అంపైర్లుగా నియమితులయ్యారు. భారత్కు చెందిన నితిన్ మీనన్ కూడా అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకోగా, మాజీ భారత పేసర్ జవగళ్ శ్రీనాథ్ ఈ టోర్నీలో మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు చేపట్టనున్నాడు.
వివరాలు
మ్యాచ్ రిఫరీలు:
డీన్ కాస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మడుగలె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగళ్ శ్రీనాథ్. అంపైర్లు: రోలాండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, అడ్రియన్ హోల్డ్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బరో, వేన్ నైట్స్, డొనోవన్ కోచ్, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, శామ్ నోగాజ్స్కీ, కేఎన్ఏ పద్మనాభన్, అల్లావుద్దీన్ పాలేకర్, అహ్సన్ రజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫిల్, లాంగ్టన్ రుసెరే, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, ఘాజీ సోహెల్, రాడ్ టక్కర్, అలెక్స్ వార్ఫ్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాకూబ్.