LOADING...
Ind vs Aus 5th T20I: గబ్బాలో వర్షంతో ఆగిన మ్యాచ్.. గిల్-అభిషేక్ మెరుపు బ్యాటింగ్! 
గబ్బాలో వర్షంతో ఆగిన మ్యాచ్.. గిల్-అభిషేక్ మెరుపు బ్యాటింగ్!

Ind vs Aus 5th T20I: గబ్బాలో వర్షంతో ఆగిన మ్యాచ్.. గిల్-అభిషేక్ మెరుపు బ్యాటింగ్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా-ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తుదిపోరు బ్రిస్బేన్‌ గబ్బా స్టేడియంలో జరుగుతోంది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కి దిగిన భారత్‌ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ స్ట్రోక్స్‌తో రన్‌రేట్‌ను పెంచారు. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో ఆట తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఆట ఆగే సమయానికి భారత్‌ 4.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ సేన సిరీస్‌ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగింది.

Details

అభిషేక్ క్యాచ్ ను వదిలేసిన మాక్స్ వెల్

మ్యాచ్‌ ఆరంభం నుంచే భారత్‌ బలమైన ఆరంభం చేసింది. బెన్‌ ద్వార్షుయిస్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 11 పరుగులు రాగా, ఆ ఓవర్‌లో అభిషేక్‌ శర్మకు అదృష్టం కలిసొచ్చింది. ఐదో బంతికి గ్లెన్‌ మాక్స్‌వెల్‌ సులభమైన క్యాచ్‌ను వదిలేశాడు. ఈ లైఫ్‌లైన్‌ తర్వాత అభిషేక్‌ మరింత ధైర్యంగా ఆడాడు. మరోవైపు వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ద్వార్షుయిస్‌ వేసిన మూడో ఓవర్‌లో గిల్‌ వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు.

Details

 4.5 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు 52/0

ఇద్దరు ఓపెనర్లు ఆస్ట్రేలియా బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టుతున్న వేళ, గబ్బాలో వర్షం రూపంలో ఆటకు విఘాతం ఏర్పడింది. 4.5 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు 52/0గా ఉంది. గిల్‌ 16 బంతుల్లో 29 (నాటౌట్‌), అభిషేక్‌ శర్మ 13 బంతుల్లో 23 (నాటౌట్‌) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ పోరు సిరీస్‌ నిర్ణయాత్మకమైనదిగా ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. భారత్‌ సిరీస్‌ గెలవాలని, ఆస్ట్రేలియా సమం చేయాలని ఉభయ జట్లు కృతనిశ్చయంతో బరిలోకి దిగాయి. ఆస్ట్రేలియా తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. కానీ టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. తిలక్‌ వర్మకు విశ్రాంతి ఇవ్వగా, అతని స్థానంలో రింకూ సింగ్‌కు తుది జట్టులో అవకాశం లభించింది.