Mohammed Shami: మన పర్యాటకాన్ని మనమే ప్రోత్సహించుకోవాలి: మాల్దీవులతో వివాదంపై షమీ
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్పందించారు. భారత పర్యాటకానికి తన మద్దతును తెలిపారు. భారతీయ బీచ్ల అందాలను ఆస్వాదించాలని పౌరులను కోరారు. 'మనం మన పర్యాటకాన్ని ప్రోత్సహించాలి, దేశం అభివృద్ధి చెందితే అది అందరికీ మంచిది. ప్రధానమంత్రి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు, కాబట్టి దానికి మద్దతు ఇవ్వాలి' అని మహ్మద్ షమీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహ్మద్ షమీ కంటే ముందు.. మాల్దీవుల్లోని ప్రజాప్రతినిధులు భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన చేసిన వ్యాఖ్యలపై చాలా మంది క్రికెట్ సెలబ్రిటీలు తీవ్రంగా స్పందించారు. పర్యాటకం కోసం భారతీయ బీచ్లను సందర్శించాలని కోరారు.
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్పై కన్నేసిన టీమిండియా
దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్పై కన్నేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరగాల్సి ఉండగా.. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్లో జరగనుంది. అయితే ఈ సిరీస్ కోసం తానేమీ కొత్తగా ఆలోచించడం లేదన్నారు. తాను ఫిట్గా ఉంటే మ్యాచ్లో తన ప్రదర్శన అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు. బీసీసీఐ తనకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని షమీ స్పష్టం చేశారు. అయితే ఇంగ్లాండ్తో సిరీస్ కోసం భారత జట్టును అంకా ప్రకటించలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.