Asia cup trophy: ఆసియా కప్ ట్రోఫీపై నఖ్వీ వివాదం.. భారత మహిళల జట్టు ఏమందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ టీ20 టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా అద్భుత ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టు వరుసగా ఎనిమిదోసారి ఛాంపియన్గా నిలిచింది. అయితే ట్రోఫీ అందుకునే సమయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ నుంచి బహుమతి తీసుకోవడానికి భారత మహిళా క్రికెటర్లు నిరాకరించారు. ఈ పరిణామంపై భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ స్పందించారు.
వివరాలు
'ట్రోఫీ తీసుకున్నా.. తీసుకోకపోయినా పట్టింపు లేదు'
నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకోకపోవడంపై అమోల్ మజుందార్ మాట్లాడుతూ.. ''భారత్ జట్టు ఆసియా కప్ ఛాంపియన్. బోర్డుపై పెద్ద అక్షరాలతో అందరికీ ఆ విషయం కనిపించింది.. అది చాలు. మన జట్టు ఛాంపియన్గా నిలిచినందుకు సంతోషం. ట్రోఫీ తీసుకున్నా తీసుకోకపోయినా మాకు పట్టింపు లేదు.
నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదనేది బీసీసీఐ వైఖరి అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గత ఏడాది పురుషుల ఆసియా కప్లో విజేతగా నిలిచిన భారత జట్టు కూడా నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
నఖ్వీ పాకిస్థాన్ మంత్రి కావడంతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్గా కూడా ఉన్నారు.
వివరాలు
లంకపై ఘన విజయం
ఇప్పుడు ఆదివారం జరిగిన మహిళల ఆసియా కప్ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి కూడా నఖ్వీ హాజరయ్యారు.
దీంతో గతేడాది పురుషుల ఆసియా కప్లో చోటుచేసుకున్న పరిణామమే మరోసారి పునరావృతమైంది. ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు 72పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.
టోర్నీ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా ఫైనల్ వరకు దూసుకొచ్చిన భారత్.. తుది పోరులోనూ ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ను సొంతం చేసుకుంది.
భారత విజయంలో షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మ మెరుపులు మెరిపించారు. వారి అద్భుత ప్రదర్శనతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. దీంతో భారత మహిళల జట్టు ఆసియా కప్ టైటిల్ను వరుసగా ఎనిమిదోసారి కైవసం చేసుకుంది.