
Sourav Ganguly: 'రాజకీయాలపై ఆసక్తి లేదు… కానీ భారత జట్టు కోచ్ కావడానికి సిద్ధం': సౌరభ్ గంగూలీ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మరోసారి తాను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో, ఎవరైనా పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా రాజకీయాలపై తనకెంత మాత్రమూ ఆసక్తి లేదని ఆయన తెలిపారు. కానీ భారత జట్టు కోచ్ కావడమే తనకిష్టమని గంగూలీ వెల్లడించడం విశేషం. 'వేర్వేరు భిన్న పాత్రల్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. 2013లో క్రికెట్కు రిటైర్ అయ్యాక బీసీసీఐ అధ్యక్షుడినయ్యాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నా వయసు 52 ఏళ్లు. భారత జట్టు కోచ్ పదవిని చేపట్టడానికి నేను సిద్ధమే. అది ఎక్కడివరకు వెళ్తుందో చూద్దామని గంగూలీ అన్నారు.
Details
కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై గంగూలీ అభిప్రాయం
2027 వన్డే ప్రపంచకప్ నాటికి ఫిట్గా ఉండటం, భారత జట్టులో చోటును కాపాడుకోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు అంత సులువుకాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. 'తదుపరి వన్డే ప్రపంచకప్ లోపు భారత్ 9 ద్వైపాక్షిక సిరీస్లలో 27 మ్యాచ్లు ఆడనుంది. అంటే ఏడాదికి రోహిత్, కోహ్లీ 15 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే అవకాశముంది. ప్రతి ఒక్క ఆటగాడిలా, వారు కూడా ఒక రోజు ఆటకు దూరమవుతారు. అది అర్థం చేసుకోవాలి. ఏడాదికి 15 మ్యాచ్లు ఆడుతూ ఫిట్గా ఉండటం, భారత జట్టులో స్థానం కాపాడుకోవడం అంత సులువుకాదు. వారికి నేనిచ్చే సలహా ఏమీ లేదు. కోహ్లీ అద్భుత ఆటగాడు. అతనికి ప్రత్యామ్నాయ ఆటగాడిని కనుగొనడానికి సమయం పడుతుందన్నారు.
Details
లక్ష్మణ్తో మూడు నెలల గ్యాప్: గంగూలీ గుర్తుచేసిన జ్ఞాపకం
2003 వన్డే ప్రపంచకప్ జట్టులో వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక కాకపోవడాన్ని గంగూలీ గుర్తుచేశారు. ''ఆ సమయంలో లక్ష్మణ్ మంచి ఫామ్లో ఉన్నా, సెలక్టర్లు దినేశ్ మోంగియాకు ప్రాధాన్యం ఇచ్చారు. నేను కెప్టెన్గా ఉన్నప్పట్లోనే ఈ నిర్ణయం జరిగింది. ఆ తర్వాత మూడు నెలల పాటు లక్ష్మణ్ నాతో మాట్లాడలేదు. అది సహజం. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో అవకాశం రాకపోవడాన్ని చూసి ఎవరికైనా నిరాశే వస్తుంది. లక్ష్మణ్ లాంటి ప్రతిభావంతుడికి నిరాశ చెందే హక్కే ఉంది. కానీ టోర్నీ ముగిసాక మేమిద్దరం మళ్లీ కలిసాము. జట్టు ప్రదర్శన పట్ల లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడు'' అని గంగూలీ తెలిపారు. ఆ ప్రపంచకప్ లో టీమ్ఇండియా రన్నరప్గా నిలిచింది