Pat Cummins: ఉప్పల్లో సన్రైజర్స్ దూకుడు.. కమిన్స్ వ్యూహం సక్సెస్
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ కింగ్స్లాంటి శక్తివంతమైన జట్టును ఉప్పల్ వేదికపై ఓడించడం అంత సులభమైన విషయం కాదు. బ్యాటర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పైనే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మెప్పించారు. ఫలితంగా 236 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. ముఖ్యంగా ఉప్పల్లో పంజాబ్పై సన్రైజర్స్ 9-0 ఆధిక్యాన్ని కొనసాగించడం విశేషం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానానికి చేరుకుంది. బౌలింగ్లో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
వివరాలు
కెప్టెన్ ఏమన్నాడంటే..
''పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, నాణ్యమైన ఆటగాళ్లతో కూడిన జట్టు. మా బ్యాటర్లు ఎలా ధాటిగా ఆడారో, వారి బ్యాటింగ్ లైనప్ కూడా అదే స్థాయిలో ప్రమాదకరంగా ఉంటుంది. అయితే మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అందిస్తున్న శుభారంభాలు జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రాత్రి మ్యాచులతో పోలిస్తే మధ్యాహ్నం జరిగే మ్యాచులకు మేము పూర్తిగా అలవాటు పడలేకపోయాం. ట్రావిస్ హెడ్ ఈ సమయానికి సాధారణంగా నిద్రపోతుంటాడు. అది కూడా ఒక కారణం కావచ్చు.
వివరాలు
బౌలింగ్ ఆప్షన్లు ఎక్కువగా ఉండటమే జట్టుకు బలం..
బౌలింగ్ విభాగం ప్రదర్శనపై నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా బౌన్సర్లతో మంచి ఫలితాలు సాధించగలిగాం. ప్రియాంశ్ ఆర్య వికెట్ కూడా అదే విధంగా దక్కింది. మా జట్టులో బౌలింగ్ ఆప్షన్లు ఎక్కువగా ఉండటం మాకు బలంగా మారింది. ఆల్రౌండర్గా నితీశ్ కుమార్ రెడ్డి ఉండటం జట్టుకు అదనపు ప్రయోజనం. తదుపరి మ్యాచ్కు కొంత విరామం లభించడం కూడా మాకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మేము మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, లీగ్ దశ ముగిసే సమయానికి కూడా అదే స్థానాన్ని నిలబెట్టుకోవడమే మా ప్రధాన లక్ష్యం'' అని కమిన్స్ పేర్కొన్నాడు.
వివరాలు
సన్ రైజర్స్ జట్టు రికార్డులివే..
సన్రైజర్స్ హైదరాబాద్ 220కి పైగా లక్ష్యాన్ని నిర్దేశించిన ప్రతి మ్యాచ్లోనూ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అలాంటి 11మ్యాచుల్లో గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై ప్రత్యర్థి జట్టుపై వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఉప్పల్ వేదికగా పంజాబ్పై వరుసగా 9 విజయాలు అందుకుంది. ఐపీఎల్లో సన్రైజర్స్పై పంజాబ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ కూపర్ కనోలీ. అతడు అజేయంగా 107 పరుగులు చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన విదేశీ ఆటగాడిగా కూపర్ కనోలీ నిలిచాడు. అతడు 22 సంవత్సరాలు 257 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.