T20 World Cup 2026: ఆసిఫ్ నజ్రుల్ యూటర్న్.. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నిర్ణయంపై మారిన వైఖరి
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తన వైఖరిని తాజాగా మార్చుకున్నారు. గతంలో భారత్లో భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ, తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ద్వారా ఐసీసీపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే భారత్లో అలాంటి ప్రమాదకర పరిస్థితులు లేవని ఐసీసీ స్పష్టం చేయడంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈపరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ ఖాళీ స్థానాన్ని స్కాట్లాండ్కు ఐసీసీ కేటాయించింది. ఈనేపథ్యంలో, గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఆసిఫ్ నజ్రుల్ తాజాగా యూటర్న్ తీసుకున్నారు. జాతీయ గౌరవాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్తో పాటు ఆటగాళ్లు కలిసి తీసుకున్నారని ఆయన తెలిపారు.
వివరాలు
ప్రపంచకప్కు దూరమవుతున్నందుకు ఎలాంటి విచారం లేదు: ఆసిఫ్
ప్రభుత్వ నిర్ణయానికి గల కారణాలను ఆటగాళ్లకు వివరించడమే ఆ సమావేశం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఐసీసీ తమకు న్యాయం చేస్తుందని తాము ఆశించడం లేదని, ప్రపంచకప్లో పాల్గొనాలా వద్దా అన్నది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన జనవరి 22న మీడియాతో వెల్లడించారు. అయితే గతంలో చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా మంగళవారం ఆయన మాట్లాడటం గమనార్హం. ప్రపంచకప్కు దూరమవుతున్నందుకు తమకు ఎలాంటి విచారం లేదని స్పష్టం చేశారు. దేశ భద్రత,జాతీయ గౌరవాన్ని పరిరక్షించడమే ప్రధాన ఉద్దేశమని,అందుకే ఈ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్,ఆటగాళ్లు తీసుకున్నారని ఆసిఫ్ తెలిపారు. ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్పై ఎలాంటి చర్యలు ఉండవని ఐసీసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.