Ravi Shastri: ఇంగ్లండ్ కోచ్ మార్పు అవసరమా?.. రవిశాస్త్రి అయితే కరెక్ట్ అన్న మాంటీ పనేసర్
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. వరుసగా మూడు టెస్టులు ఓడిపోయి 0-3తో సిరీస్ను చేజార్చుకోవడంతో హెడ్ కోచ్ బ్రెండెన్ మెక్కలమ్ భవిష్యత్తుపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. కేవలం 11 రోజుల వ్యవధిలోనే సిరీస్ను కోల్పోవడం,అలాగే 'బాజ్బాల్' వ్యూహం పూర్తిగా విఫలమవడం ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై అధిక ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, ఊహించని స్థాయిలో పరాజయం పాలవడంతో కొత్త కోచ్ అవసరమనే డిమాండ్ మరింత బలపడుతోంది.
వివరాలు
2022లో హెడ్ కోచ్గా మెక్కలమ్
ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తదుపరి హెడ్ కోచ్గా భారత మాజీ జట్టు కోచ్ రవిశాస్త్రిని నియమించాలంటూ అతడు బలంగా సూచించాడు. ఆస్ట్రేలియాను వారి స్వంత గడ్డపై ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఓడించాలన్నది రవిశాస్త్రికి బాగా తెలుసని పనేసర్ అభిప్రాయపడ్డాడు. 2022లో రాబ్ కీ నిర్ణయంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మెక్కలమ్ను హెడ్ కోచ్గా నియమించిన విషయం తెలిసిందే. అంతకు ముందు యాషెస్లో 4-0 ఓటమి తర్వాత బాధ్యతలు చేపట్టిన మెక్కలమ్-స్టోక్స్ జోడీ, ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. తొలి 11 టెస్టుల్లో 10 విజయాలు సాధించి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది.
వివరాలు
యాషెస్ సిరీస్లో 0-3తో వెనుకబడిన ఇంగ్లండ్
అయితే ఆ తర్వాత నుంచి ఇంగ్లండ్ ప్రదర్శన క్రమంగా దిగజారింది. ఆస్ట్రేలియా, భారత్లతో జరిగిన ప్రతిష్ఠాత్మక ఐదు టెస్టుల సిరీస్లలో ఒక్కదాన్ని కూడా గెలవలేకపోయింది. గత 33 టెస్టుల్లో 16 పరాజయాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్, ప్రస్తుత యాషెస్ సిరీస్లో 0-3తో వెనుకబడి నిలిచింది. తన యూట్యూబ్ ఛానెల్లో జర్నలిస్టు రవి బిష్ట్తో సంభాషించిన మాంటీ పనేసర్, "ఆస్ట్రేలియాను నిజంగా ఎలా ఓడించాలో ఎవరికైనా తెలుసా? వారి బలహీనతలను మానసికంగా, శారీరకంగా, వ్యూహపరంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వ్యక్తి కావాలి. నా దృష్టిలో ఇంగ్లండ్కు వచ్చే హెడ్ కోచ్గా రవిశాస్త్రే సరైన ఎంపిక" అని వ్యాఖ్యానించాడు.
వివరాలు
2018-19 బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్ భారత్
రవిశాస్త్రి కోచ్గా ఉన్న సమయంలో భారత జట్టు ఆస్ట్రేలియాను రెండు సార్లు వారి గడ్డపైనే మట్టికరిపించింది. 2018-19 బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత 2020-21 సిరీస్లో అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటైనప్పటికీ, గాయాలతో నిండిన జట్టుతో తిరిగి సిరీస్ను కైవసం చేసుకోవడం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.