Gautam Gambhir: గంభీర్ తొలగింపుపై పుకార్లు.. బీసీసీఐ అధికారి క్లారిటీ స్టేట్మెంట్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు 2025 సంవత్సరం కలిసి రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు భారత్ ఆసియా కప్ (టీ20లు), ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) గెలుచుకుని విజయాలు సాధించినప్పటికీ, మరోవైపు టెస్టు క్రికెట్లో మాత్రం తీవ్ర పరాజయాలను ఎదుర్కొంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ల్లో భారత్ ఓటమిపాలైంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా స్వదేశంలోనే భారత్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అంతకుముందు 2024లో గంభీర్ కోచ్గా ఉన్న సమయంలోనే భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఓడిన విషయం కూడా ప్రస్తావనకు వస్తోంది. ఈ వరుస పరాజయాలు గంభీర్ టెస్టు జట్టు కోచ్గా సామర్థ్యంపై పెద్ద ప్రశ్నలను తెరపైకి తెచ్చాయి.
Details
వీవీఎస్ లక్ష్మణ్ను సంప్రదించలేదు
ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థ ఒక కీలక నివేదికను ప్రచురించింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో ఘోర ఓటమి అనంతరం, బీసీసీఐలోని ఒక కీలక వ్యక్తి వీవీఎస్ లక్ష్మణ్ను సంప్రదించి, రెడ్ బాల్ జట్టు కోచ్ బాధ్యతలపై ఆయనకు ఆసక్తి ఉందా అని అడిగినట్లు ఆ నివేదికలో పేర్కొంది. అయితే ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 'హెడ్ ఆఫ్ క్రికెట్'గా ఉన్న బాధ్యతలతో లక్ష్మణ్ పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని పీటీఐ స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై ఓ సీనియర్ బీసీసీఐ అధికారి స్పందిస్తూ వీవీఎస్ లక్ష్మణ్తో మేము అధికారికంగానీ, అనధికారికంగానీ ఎలాంటి చర్చ జరపలేదు. గౌతమ్ గంభీర్పై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది.
Details
ఈ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు
ఈ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. అయినప్పటికీ భారత క్రికెట్లో నిర్ణయాలు ఎప్పుడు, ఎలా తీసుకుంటారో ముందుగా అంచనా వేయడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్కు ముందు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను జట్టు నుంచి తప్పిస్తారని ఎవరూ ఊహించలేదని వారు గుర్తు చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్ ఒప్పందం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉన్నప్పటికీ, ఐదు వారాల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ ఫలితాల ఆధారంగా ఆ ఒప్పందాన్ని తిరిగి సమీక్షించే అవకాశం ఉందని సమాచారం. దీంతో గంభీర్ భవిష్యత్తుపై చర్చలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి.