China masters badminton : బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. నిరాశపరిచిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ
ఈ వార్తాకథనం ఏంటి
సొంతగడ్డపై జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో తీవ్రంగా నిరాశపరిచిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ.. ఇప్పుడు మరో పెద్ద టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ 750 టోర్నీలో ఈ భారత జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నం.5 సాత్విక్-చిరాగ్ జంట.. ప్రపంచ 29వ ర్యాంక్ క్రీడాకారులు నుర్ మహ్మద్ అర్జియాన్-టాన్ వీ కియాంగ్ (మలేసియా)పై 21-15, 18-21, 21-11తో విజయం సాధించింది. గంటా 6 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో భారత జోడీ అద్భుతంగా పోరాడింది. మలేసియా జోడీతో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన ధీమాతో సెమీఫైనల్లో బరిలోకి దిగిన సాత్విక్-చిరాగ్కు తొలి గేమ్లో ఆరంభం అంతగా కలిసిరాలేదు.
వివరాలు
11-9తో పైచేయి సాధించిన సాత్విక్-చిరాగ్..
ప్రత్యర్థులు 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. అయితే భారత జోడీ వెంటనే పుంజుకుని వరుస పాయింట్లు సాధించింది.
7-5తో ఆధిక్యంలోకి వచ్చింది. విరామ సమయానికి 11-9తో పైచేయి సాధించిన సాత్విక్-చిరాగ్.. ఆ తర్వాత కూడా దూకుడును కొనసాగించి తొలి గేమ్ను సొంతం చేసుకున్నారు.
రెండో గేమ్ మాత్రం హోరాహోరీగా సాగింది. ఇరు జోడీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి.
5-5, 13-13తో స్కోరు సమమైంది. 18-18తో ఉన్న సమయంలో మలేసియా జోడీ వరుసగా మూడు పాయింట్లు సాధించి 21-18తో గేమ్ను గెలుచుకుంది. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్కు వెళ్లింది.
వివరాలు
ఆరంభం నుంచే దూకుడు..
మూడో గేమ్లో మాత్రం సాత్విక్-చిరాగ్ పూర్తిగా ఆధిపత్యం చలాయించారు.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జోడీ విరామ సమయానికి 11-4తో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ 21-11తో మూడో గేమ్ను గెలిచింది. తద్వారా మ్యాచ్ను 2-1తో సొంతం చేసుకుని ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
ఆదివారం జరిగే ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట చైనాకు చెందిన హె జి టింగ్-రెన్ జియాంగ్ యు ద్వయంతో తలపడనుంది.
ఈ ఏడాది సాత్విక్-చిరాగ్ జోడీ ఇప్పటివరకు ఒకే టైటిల్ గెలుచుకుంది. మేలో జరిగిన సింగపూర్ ఓపెన్లో విజేతగా నిలిచింది.
ఇప్పుడు చైనా మాస్టర్స్ టైటిల్ను కూడా సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించాలని భారత జోడీ పట్టుదలగా ఉంది.