Match Fixing : ఎల్పీఎల్లో సంచలనం.. 4 ఓవర్లలో 71 పరుగులు.. మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్న నెటిజన్లు
ఈ వార్తాకథనం ఏంటి
లంక ప్రీమియర్ లీగ్ (LPL 2026) ఈ సీజన్ ఆరంభం నుంచే వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఫ్రాంచైజీల అవినీతి ఆరోపణలు, షాహీన్ అఫ్రిది ఎంపికపై వివాదం, ఓ ఫ్రాంచైజీ యజమాని అరెస్ట్ వంటి పరిణామాలు ఇప్పటికే లీగ్ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో సీజన్ ముగియడానికి ఇంకా రెండు వారాల సమయం ఉండగానే మరో సంచలన ఘటన చోటుచేసుకుని లీగ్ పారదర్శకతపై కొత్త అనుమానాలకు తావిచ్చింది.
వివరాలు
4 ఓవర్లలో 71 పరుగులు సమర్పించిన దహానీ
కొలంబో క్యాప్స్-జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కొలంబో తరఫున బౌలింగ్ చేసిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షానవాజ్ దహానీ అత్యంత పేలవ ప్రదర్శన చేశాడు.
తన నాలుగు ఓవర్ల కోటాలో 6 ఎక్స్ట్రాలతో కలిపి 71 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
దహానీ తొలి ఓవర్లోనే వైడ్తో పరుగుల ఖాతా తెరిచి మొత్తం 6 పరుగులు ఇచ్చాడు. రెండో ఓవర్లో జాఫ్నా బ్యాటర్లు రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 21 పరుగులు రాబట్టారు.
అనంతరం చివరి ఓవర్లలో తిరిగి బౌలింగ్కు వచ్చిన దహానీ వరుసగా వైడ్లు, నోబాల్స్ వేస్తూ మరింత నిరాశపరిచాడు.
వివరాలు
చివరి ఓవర్లో 31 పరుగులు
దహానీ వేసిన చివరి ఓవర్లో జాఫ్నా బ్యాటర్ తోహిద్ హృదోయ్ విరుచుకుపడ్డాడు.
వరుసగా మూడు సిక్సర్లు బాదిన అతడు, ఆ తర్వాత మరో సిక్స్, ఒక ఫోర్తో కలిపి ఒకే ఓవర్లో 31 పరుగులు సాధించాడు.
దీంతో దహానీ పేరిట ఎల్పీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్ నమోదైంది.
వివరాలు
సోషల్ మీడియాలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.
ఎల్పీఎల్ నిర్వహణ పారదర్శకతపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల ప్రారంభంలోనే అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై జాఫ్నా కింగ్స్ యజమానుల్లో ఒకరైన మన్జోత్ కల్రాను శ్రీలంక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు విభాగం అరెస్ట్ చేసిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
కొందరు ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా క్యాచ్లు వదులుతున్నారని, 30 పరుగుల ఓవర్లు సాధారణమైపోయాయని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
వివరాలు
గాయాల నుంచి కోలుకున్నా.. నిరాశపరిచిన దహానీ
27 ఏళ్ల షానవాజ్ దహానీ ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ టీ20 బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఒక సీజన్లో 20 వికెట్లు, తర్వాతి సీజన్లో 17 వికెట్లు తీసి స్టార్ బౌలర్గా ఎదిగాడు.
అయితే 2022 ఆసియా కప్ సందర్భంగా సైడ్ స్ట్రెయిన్ గాయం, అనంతరం వేలి విరగడం, వీపు నొప్పి, 2024 చివర్లో మడమ గాయం కారణంగా అతడి కెరీర్కు ఎదురుదెబ్బ తగిలింది.
రెండేళ్లుగా ఫిట్నెస్పై దృష్టి పెట్టి గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, ఈ మ్యాచ్లో సరైన గేమ్ ప్లాన్ లేకపోవడం వల్లే దహానీ కెరీర్లోనే అత్యంత చేదు బౌలింగ్ స్పెల్ నమోదు చేశాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.