Ranji Trophy: రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన సర్వీసెస్ జట్టు.. 63 ఏళ్ల రికార్డు గల్లంతు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ క్రికెట్ చరిత్రలో రంజీ ట్రోఫీ టోర్నీలో మరో అద్భుతమైన రికార్డు నమోదైంది. బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా సర్వీసెస్, అసోం మధ్య తిన్సుకియాలో జరిగిన పోరు నిలిచింది. కేవలం 540 బంతుల్లోనే మ్యాచ్ పూర్తవడం దేశీయ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతగా నిలిచింది. ఈ మ్యాచ్లో సర్వీసెస్ జట్టు 8 వికెట్ల తేడాతో అసోంపై గెలిచి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో సర్వీసెస్ 63 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది. ఇంతకుముందు 1962 జనవరిలో ఢిల్లీ-రైల్వేస్ మ్యాచ్ కేవలం 547 బంతుల్లో ముగియడం అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా రికార్డుల్లో ఉంది. అయితే ఈ తాజా మ్యాచ్తో ఆ రికార్డు చెరిపోయింది.
Details
హ్యాట్రిక్ సాధించిన అర్జున్ శర్మ, మోహిత్ జంగ్రా
రెండో రోజైన ఆదివారం అసోం నిర్దేశించిన 71 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సర్వీసెస్ 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో అసోం బ్యాటింగ్ పూర్తిగా విఫలమై, కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్లో సర్వీసెస్ బౌలర్లు అర్జున్, మోహిత్ జంగ్రా చెరో హ్యాట్రిక్ సాధించి అరుదైన రికార్డులు సృష్టించారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అర్జున్ శర్మ రియాన్ పరాగ్, సుమిత్, శివశంకర్లను వరుస బంతుల్లో ఔట్ చేయగా, పేసర్ మోహిత్ జంగ్రా ప్రద్యున్ సైకియా,ముఖ్తార్ హుస్సేన్, భార్గవ్లను పెవిలియన్ చేర్చాడు. ఈ విజయం తర్వాత సర్వీసెస్ జట్టు ఎలైట్ గ్రూప్-సిలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.