Axar Patel: విజయానందంలో ఢిల్లీకి షాక్.. కెప్టెన్ అక్షర్ పటేల్కు భారీ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అక్షర్ పటేల్పై బీసీసీఐ భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలమైనందుకు అక్షర్ పటేల్కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ను ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు.
వివరాలు
మళ్లీ పునరావృతమైతే జట్టు సభ్యులపై కూడా జరిమానాలు
ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది తొలి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్కు మాత్రమే జరిమానా విధించారు. అయితే ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే కెప్టెన్తో పాటు జట్టు సభ్యులపై కూడా జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 56 పరుగులతో రాణించగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 59 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్కార్ట్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు తీసి పంజాబ్ను కొంతమేర నియంత్రించారు.
వివరాలు
రాణించిన అక్షర్ పటేల్
ముఖ్యంగా చివరి ఓవర్లలో లుంగి న్గిడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ స్కోరు 210 పరుగులకే పరిమితమైంది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. 74 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ 56 పరుగులతో అర్ధసెంచరీ చేసి జట్టును ఆదుకోగా, డేవిడ్ మిల్లర్ 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ మెరుపు బ్యాటింగ్తో మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పేశారు. కేవలం 19 ఓవర్లలోనే 216పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.