Prabath Jayasuriya: భారత్తో టెస్టులో శ్రీలంక స్పిన్నర్ జయసూర్యకు షాక్.. ఐసీసీ కీలక చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తన ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నాడు. ఔటైన తర్వాత ఆగ్రహంతో ప్రవర్తించినందుకు అతడిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. జయసూర్యను అధికారికంగా మందలించడంతో పాటు, అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను చేర్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను జయసూర్య ఉల్లంఘించినట్లు నిర్ధారించింది. అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ పరికరాలను, మైదానంలోని వస్తువులను దుర్వినియోగం చేయడం ఈ నిబంధన పరిధిలోకి వస్తుంది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాాలు
మానవ్ సుతార్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ
నైట్వాచ్మన్గా బ్యాటింగ్కు వచ్చిన జయసూర్య.. భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
అంపైర్ నిర్ణయంపై తీవ్ర నిరాశకు గురైన అతడు పెవిలియన్కు వెళ్తూ బౌండరీ లైన్ వద్ద ఉన్న వెడ్జెస్ను బ్యాట్తో కొట్టాడు.
అనంతరం డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి గ్లోవ్స్ను కూడా కోపంగా విసిరేశాడు.
భారత్ 503/9 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన అనంతరం.. రెండో రోజు చివరి మూడు ఓవర్లలోనే శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 8/2తో కష్టాల్లో పడింది.
ఈ ఒత్తిడి కూడా జయసూర్య ప్రవర్తనకు కారణంగా భావిస్తున్నారు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన శిక్షను జయసూర్య అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం రాలేదు.
వివరాలు
మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత
కాగా, ఈ మ్యాచ్లో ఐసీసీ చర్యలు తీసుకున్న ఏకైక ఆటగాడు జయసూర్య మాత్రమే కాదు.
భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత్ ఫెర్నాండో మధ్య జరిగిన ఘర్షణపై కూడా ఐసీసీ కఠినంగా వ్యవహరించింది.
ఇద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. చెరో డీమెరిట్ పాయింట్ను కేటాయించింది.
మ్యాచ్ 17వ ఓవర్లో అసిత్ ఫెర్నాండో బౌలింగ్లో జైస్వాల్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. పెవిలియన్కు వెళ్తున్న జైస్వాల్ను ఉద్దేశించి ఫెర్నాండో ఏదో అనడంతో.. అతడు వెనక్కి తిరిగి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు నెట్టుకుంటూ తలలతో ఢీకొట్టుకున్నారు.