Vaibhav Sooryavanshi: ఫైనల్ ఆడొద్దా?.. వైభవ్ సూర్యవంశీ విషయంలో గంభీర్దే తుది నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తరఫున యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడతాడా లేదా అన్నది భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. సెప్టెంబర్ 6 నుంచి చెన్నై వేదికగా సౌత్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం భారత టీ20 జట్టులో ఉన్న వైభవ్ సూర్యవంశీతో పాటు ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు కూడా దులీప్ ట్రోఫీ ఫైనల్లో పాల్గొనాలా లేదా అన్నది గంభీర్ ఆమోదంపైనే ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్లను మాత్రం దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆడాలని జాతీయ సెలక్టర్లు కోరినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
వివరాలు
వైభవ్ విషయంలో గంభీర్ నిర్ణయమే కీలకం
ప్రస్తుతం ఈ ముగ్గురికి పోటీ క్రికెట్ లేకపోవడంతో.. మధ్యలో లభించిన దేశవాళీ మ్యాచ్ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారత టీ20 జట్టు సెప్టెంబర్ 9 లేదా 10న దిల్లీలో సమావేశం కానుంది. వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ముగ్గురూ ప్రస్తుతం భారత టీ20 జట్టులోనే ఉన్నారు.
టీ20 జట్టు షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9లేదా 10న దిల్లీకి చేరాలని గౌతమ్ గంభీర్ కోరితే.. ఈ ముగ్గురూ దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆడే అవకాశం ఉండదు.
అయితే ఫైనల్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 10రాత్రి దిల్లీకి చేరేందుకు అనుమతి ఇస్తే మాత్రం చెన్నైలో జరిగే దులీప్ ట్రోఫీ ఫైనల్లో వారు పాల్గొనే అవకాశం ఉంటుంది.
వివరాలు
రాహుల్, పడిక్కల్, సిరాజ్లకు సెలక్టర్ల సూచన
అందువల్ల ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విషయంలో గంభీర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్ చివరిసారిగా ఆగస్టు 27న మ్యాచ్ ఆడారు.
ఆ తర్వాత వీరికి తదుపరి అంతర్జాతీయ మ్యాచ్ సెప్టెంబర్ 27న వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్లో ఉంది.
దీంతో ఆ మధ్యలో లభించిన దేశవాళీ క్రికెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాతీయ సెలక్టర్లు భావిస్తున్నారు.
పోటీ క్రికెట్కు దూరంగా ఎక్కువ సమయం ఉండకుండా దులీప్ ట్రోఫీ ఫైనల్ ద్వారా మ్యాచ్ ప్రాక్టీస్ పొందాలని సూచించినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
వివరాలు
ఫైనల్ను ప్రత్యక్షంగా వీక్షించనున్న అగార్కర్
భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా దులీప్ ట్రోఫీ ఫైనల్ను చెన్నైలో ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
ఇదే సమయంలో అగార్కర్ ప్రస్తుత కాంట్రాక్ట్ అక్టోబర్ 4తో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని పొడిగించే అంశంపై బీసీసీఐలో ఇంకా చర్చ జరగాల్సి ఉంది.
నెట్ బౌలర్లుగా మయాంక్, కార్తిక్, మొహ్సిన్
ఇక ఆసియా క్రీడలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ మరో కీలక ఏర్పాట్లు చేస్తోంది. మయాంక్ యాదవ్, కార్తిక్ త్యాగి, మొహ్సిన్ ఖాన్లకు జపాన్ వీసాల కోసం బీసీసీఐ దరఖాస్తు చేసినట్లు సమాచారం.
భారత పురుషుల జట్టుకు నెట్ బౌలర్లుగా వీరిని ఉపయోగించాలన్న కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అభ్యర్థన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.