Shreyas Iyer: మైదానంలోకి శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. గాయంతో కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న అయ్యర్.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో నిర్వహించిన ఇంటెన్సివ్ రిహాబ్ ప్రోగ్రామ్ను విజయవంతంగా పూర్తి చేశాడు. గతేడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్కు తీవ్రమైన గాయం అయ్యింది. ఈ గాయం కారణంగా ఆ తర్వాత జరిగిన పలు అంతర్జాతీయ మ్యాచ్లకు అతను దూరమయ్యాడు. డిసెంబర్ 25న బీసీసీఐ CoEలో చేరిన అయ్యర్.. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ అంశాల్లో మంచి పురోగతి సాధించాడు. రిహాబ్ సమయంలో బ్యాటింగ్, ఫీల్డింగ్లో నాలుగు సెషన్ల పాటు కఠినమైన సాధన చేశాడు.
Details
ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైద్య బృందం
అలాగే మ్యాచ్ సిమ్యులేషన్ సెషన్లలోనూ పాల్గొని తన ఫిట్నెస్ను పరీక్షించుకున్నాడు. ఈ అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో శ్రేయస్కు పోటీ మ్యాచ్లు ఆడేందుకు వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలోకి దిగనున్నాడు. జనవరి 6న హిమాచల్ప్రదేశ్తో జరిగే మ్యాచ్లో ముంబయి తరఫున అతను బరిలోకి దిగనుండటం ఖాయమైంది. ఆ మ్యాచ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడితే శ్రేయస్ పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించినట్లుగా పరిగణిస్తారు.
Details
జనవరి 11న న్యూజిలాండ్ తో వన్డే సిరీస్
ఇదిలా ఉండగా, జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించింది. దీంతో నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు ఆ జట్టుకు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు ఎంపిక కాకపోతే, శ్రేయస్ అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్ల్లోనూ ముంబయి తరఫున ఆడనున్నాడు.