Loading...
PV Sindhu: సిక్సర్‌పై సింధు గురి.. దిల్లీలో మరో పతకం వస్తుందా?
సిక్సర్‌పై సింధు గురి.. దిల్లీలో మరో పతకం వస్తుందా?

PV Sindhu: సిక్సర్‌పై సింధు గురి.. దిల్లీలో మరో పతకం వస్తుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి క్రీడలోనూ ప్రపంచ టోర్నీకి ఎంతో ప్రతిష్ఠ ఉంటుంది. ప్రపంచ స్థాయిలో అత్యంత కఠినమైన పోటీని ఎదుర్కొనే ఈ మెగా ఈవెంట్‌లో ఒక్క పతకం సాధించడం కూడా గొప్ప ఘనతే. అలాంటిది భారత స్టార్‌ షట్లర్‌ పివి.సింధు ఇప్పటికే ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణంతో పాటు మొత్తం ఐదు పతకాలు సాధించింది. ఇప్పుడు మరో పతకంపై ఆమె కన్నేసింది. దిల్లీలో సోమవారం ప్రారంభం కానున్న ప్రపంచ టోర్నీలో సింధు ఆరో పతకం కోసం బరిలోకి దిగుతోంది. సింధుతో పాటు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంటపైనా పతక అంచనాలు ఉన్నాయి. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ భారత్‌లో జరుగుతోంది.

వివరాలు

సింధుకు అనుకూలంగా డ్రా

దిల్లీ వేదికగా సోమవారం ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై భారత షట్లర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇప్పటికే ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకాలు సాధించిన సింధుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహిళల సింగిల్స్‌లో సింధుకు డ్రా కూడా అనుకూలంగానే కనిపిస్తోంది. తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న ఆమె తొలి రౌండ్లో ప్రపంచ 141వ ర్యాంకర్‌ సోఫియా నోబెల్‌ (ఐర్లాండ్‌)తో తలపడనుంది.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ వాంగ్‌ జి యీ (చైనా)ను సింధు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఇటీవల జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలవడంతో సింధు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమెపై అంచనాలు మరింత పెరిగాయి.

వివరాలు

లక్ష్యసేన్‌కు పతకంపై గురి

మహిళల సింగిల్స్‌లో భారత యువ కెరటం ఉన్నతి హుడా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలి రౌండ్లో ఆమె తుజార్‌ (మయన్మార్‌)తో తలపడుతుంది.

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌పై కూడా పతక ఆశలు ఉన్నాయి. 14వ సీడ్‌గా ఉన్న లక్ష్య తొలి రౌండ్లో కొలిన్స్‌ (ఆస్ట్రియా)తో పోటీపడనున్నాడు.

మరో భారత ఆటగాడు ఆయుష్‌ శెట్టికి మాత్రం కఠినమైన డ్రా ఎదురైంది. తొలి రౌండ్లోనే ప్రపంచ నంబర్‌వన్‌ షి యుకి (చైనా)తో అతడు తలపడాల్సి ఉంది.

ADVERTISEMENT

వివరాలు

సాత్విక్‌-చిరాగ్‌పై భారీ ఆశలు

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట పతకం సాధించే సత్తా కలిగి ఉంది.

అయితే భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న సాత్విక్‌ పూర్తి ఫిట్‌గా ఉండటం ఈ జంటకు కీలకం కానుంది.

తొలి రౌండ్లో భారత జంటకు బై లభించింది. ఎంఆర్‌ అర్జున్‌-హరిహరన్‌ జంట కూడా పురుషుల డబుల్స్‌లో బరిలో ఉంది. తొలి రౌండ్లో స్కాట్‌-రేమాండ్స్‌ (ఐర్లాండ్‌) జోడీతో భారత ద్వయం తలపడనుంది.

ADVERTISEMENT

వివరాలు

డబుల్స్‌లోనూ భారత పోటీ

మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జంట తొలి రౌండ్లో పౌలా-లూసియా (స్పెయిన్‌) జోడీని ఎదుర్కోనుంది.

మరో భారత జంట సిమ్రన్‌-కవిప్రియ.. నికోల్‌-మారియా (స్పెయిన్‌) ద్వయంతో తలపడనుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రుత్విక శివాని-రోహన్‌ జంట తొలి రౌండ్లో జొనాథన్‌-క్రిస్టాల్‌ (కెనడా) జోడీతో పోటీపడనుంది.

మొత్తంగా సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లపై భారీ అంచనాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఇప్పటికే ఐదు పతకాలు సాధించిన సింధు.. ఆరో ప్రపంచ పతకాన్ని గెలిచి సిక్సర్‌ కొడుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT