SRH IPL 2026: షాకింగ్.. సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ దెబ్బ.. ఈ సీజన్కు ఆ ప్లేయర్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ ఈ సీజన్ మొత్తం నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆటగాడు తన అంతర్జాతీయ కెరీర్లో ఒక్క టీ20 మ్యాచ్ మాత్రమే ఆడినా, జట్టు హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి, కెప్టెన్ పాట్ కమిన్స్లను ప్రభావితం చేశాడు. ఈ కారణంగా వేలంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ అతడిని రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయానికి గురైన కారణంగా జాక్ ఎడ్వర్డ్స్ ఈ సీజన్ మొత్తం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ సీజన్లో గాయపడిన రెండో ఆటగాడిగా అతడు నిలిచాడు.
వివరాలు
వీళ్లు కూడా తప్పుకున్నట్లే..
మరోవైపు, కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న దశలో ఉన్నాడు. అందువల్ల అతను ప్రారంభ మ్యాచ్లలో పాల్గొనలేడు. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక మార్చి 19న మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా ఈ సీజన్ నుంచి తప్పుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన నాథన్ ఎల్లిస్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సామ్ కర్రన్ ఈ జాబితాలో ఉన్నారు. అలాగే పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన లాకీ ఫెర్గూసన్ కుటుంబ కారణాల వల్ల ఈ సీజన్కు దూరమయ్యాడు.
వివరాలు
విదేశీ పేసర్ల కోసం వేట
నాథన్ ఎల్లిస్ తప్పుకున్న విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇప్పటికే ధృవీకరించారు. అతని స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకునేందుకు ఫ్రాంచైజీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒట్టోనీల్ బార్ట్మన్ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఒప్పందం నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతడిని జట్టులో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు విదేశీ ఆల్రౌండర్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ జట్టు ప్రత్యేకంగా ఓ విదేశీ పేసర్ను తీసుకునే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.