LOADING...
T20 World Cup 2026: బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు శ్రీలంక సిద్ధం.. ఐసీసీకి షెడ్యూల్‌ సవాల్
బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు శ్రీలంక సిద్ధం.. ఐసీసీకి షెడ్యూల్‌ సవాల్

T20 World Cup 2026: బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు శ్రీలంక సిద్ధం.. ఐసీసీకి షెడ్యూల్‌ సవాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా భావించే టీ20 వరల్డ్‌ కప్‌ ఆరంభానికి ముందే తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. భారత్‌-బంగ్లాదేశ్‌ దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రీడారంగానికీ విస్తరించాయి. భద్రతా కారణాలను చూపిస్తూ తమ జట్టును భారత్‌కు పంపమని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) స్పష్టంగా తేల్చిచెప్పడంతో, ఈ వివాదానికి మధ్యేమార్గం వెతికే ప్రయత్నాల్లో ఐసీసీ (ICC) నిమగ్నమైంది. ఈ క్రమంలో వేదికల మార్పుపై ఆలోచనలు జరుగుతున్నాయి.

Details

 వివాదం ఎక్కడ మొదలైంది?

ఇటీవలి కాలంలో భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఆదేశాల మేరకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ పరిణామానికి ప్రతిస్పందనగా, భద్రతా సాకుతో టీ20 వరల్డ్‌ కప్‌ కోసం తమ జట్టును భారత్‌కు పంపరాదని బంగ్లాదేశ్‌ నిర్ణయించింది. ఫలితంగా షెడ్యూల్‌ ప్రకారం భారత్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

Details

సిద్ధంగా ఉన్న శ్రీలంక

బంగ్లాదేశ్‌ విజ్ఞప్తి మేరకు వారి మ్యాచ్‌లను తటస్థ వేదికలకు తరలించే అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) అప్రమత్తమైంది. ఇప్పటికే పాకిస్థాన్‌ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లకూ శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లను కూడా అక్కడే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. కొలంబోలోని రెండు స్టేడియాలు, పల్లెకెలెలోని ఒక స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. అదనపు మ్యాచ్‌ల నిర్వహణ పెద్ద సవాలే అయినప్పటికీ, అవసరమైన వసతులు కల్పిస్తే తాము సిద్ధమేనని శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Details

షెడ్యూల్‌లో మార్పులు తప్పవా? 

బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లను కొలంబో లేదా ఇతర నగరాలకు సర్దుబాటు చేయడానికి ఐసీసీ కసరత్తు చేస్తోంది. ఒకవేళ బంగ్లాదేశ్‌ జట్టు సెమీ ఫైనల్‌ లేదా ఫైనల్‌కు చేరుకుంటే, అప్పటికి భారత్‌లో జరగాల్సిన కీలక మ్యాచ్‌లను కూడా శ్రీలంకకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది టోర్నీ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement