LOADING...
Sunil Gavaskar: హర్మన్‌ప్రీత్ సారథ్యంలో గోల్డెన్‌ మోమెంట్‌..గావస్కర్‌ స్పందన వైరల్‌!
హర్మన్‌ప్రీత్ సారథ్యంలో గోల్డెన్‌ మోమెంట్‌..గావస్కర్‌ స్పందన వైరల్‌!

Sunil Gavaskar: హర్మన్‌ప్రీత్ సారథ్యంలో గోల్డెన్‌ మోమెంట్‌..గావస్కర్‌ స్పందన వైరల్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. దాదాపు 47 ఏళ్ల తర్వాత మహిళల వన్డే విభాగంలో ప్రపంచకప్‌ ట్రోఫీని భారత్‌ గెలుచుకుంది. ఈ విజయంతో 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత పురుషుల జట్టు సాధించిన తొలి ప్రపంచకప్‌ గెలుపు మరోసారి గుర్తుతెచ్చింది. ఈ రెండు విజయాల మధ్య పోలికలు మొదలయ్యాయి. అయితే, ఈ అంశంపై మాజీ భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ స్పందించారు. ఈ రెండు విజయాలను ఒకే తీరుగా పోల్చడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

మహిళల జట్టు ఈ అద్భుత విజయానికి ముందే రెండు సార్లు ఫైనల్‌ చేరింది 

"1983లో భారత పురుషుల జట్టు ప్రపంచకప్‌ గెలిచింది. ఇప్పుడు మహిళల జట్టు కూడా ట్రోఫీని అందుకుంది. దాంతో ఈ రెండు విజయాలను ఒకే కోణంలో చూడటం మొదలైంది. కానీ, మహిళల జట్టుతో పోలిస్తే ఆ కాలంలో పురుషుల జట్టు ఒక్కసారి కూడా నాకౌట్‌ దశకు చేరుకోలేదు. గ్రూప్‌ దశలోనే ఆగిపోయింది. మరోవైపు మహిళల జట్టు ఈ అద్భుత విజయానికి ముందే రెండు సార్లు ఫైనల్‌ వరకు చేరింది, అంటే వారి రికార్డు అద్భుతంగా ఉంది.1983 ప్రపంచకప్‌ భారత క్రికెట్‌కు ప్రాణం పోసింది. అప్పటి నుంచి ప్రపంచం మొత్తం భారత్‌ గురించి మాట్లాడడం ప్రారంభించింది. ఆ విజయంతో అనేక మంది తమ పిల్లలను క్రికెట్‌లో కెరీర్‌గా కొనసాగించేందుకు ప్రోత్సహించారు.

వివరాలు 

మహిళల జట్టు ఈ అద్భుత విజయానికి ముందే రెండు సార్లు ఫైనల్‌ చేరింది 

తర్వాత ఐపీఎల్‌ రావడంతో భారత క్రికెట్‌ ఆర్థికంగా కొత్త ఎత్తుకి చేరింది. అప్పట్లో నగరాలకే పరిమితమైన క్రికెట్‌ ఇప్పుడు గ్రామాల దాకా విస్తరించింది. ఇప్పుడు మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలుపుతో, ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌లో ఆధిపత్యం చూపుతున్న జట్లను భారత జట్టు బలంగా కదిలించింది," అని గావస్కర్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

 2005, 2017 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు పోటీ 

భారత మహిళల జట్టు గతంలో 2005, 2017 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో పోటీ చేసినా, విజేతగా నిలువలేకపోయింది. అయితే ఈసారి చివరి వరకు పట్టుదలగా పోరాడి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇక పురుషుల జట్టు విషయానికి వస్తే - 1983లో విజేతగా నిలిచిన తర్వాత, 2003లో మళ్లీ ఫైనల్‌కు చేరింది కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. 2011లో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో మళ్లీ ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. 2023లో రోహిత్‌ శర్మ నాయకత్వంలో ఫైనల్‌ ఆడినా, ఈసారి విజయం మాత్రం చేజారింది.