
Sunil Gavaskar: డక్వర్త్-లూయిస్పై గవాస్కర్ ఆగ్రహం.. ఆ పద్దతి ఏంటో అర్థం కాదు..
ఈ వార్తాకథనం ఏంటి
డక్వర్త్-లూయిస్ పద్ధతి (DLS)పై టీమ్ఇండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో, ఆఖరికి మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 26 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులు సాధించింది. అనంతరం డక్వర్త్-లూయిస్ పద్ధతినిబట్టి ఆస్ట్రేలియాకు లక్ష్యంగా 131 పరుగులు నిర్దేశించారు. ఈ విషయం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగించింది, ఎందుకంటే భారత్ చేసిన మొత్తం కంటే ఐదు పరుగులు తక్కువగా టార్గెట్ ఇవ్వబడింది. ఆస్ట్రేలియా ఆ లక్ష్యాన్ని 21.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.
వివరాలు
ఇరుజట్లకూ న్యాయం జరిగే విధంగా టార్గెట్
ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ.. "డక్వర్త్-లూయిస్ పద్ధతి అంటే చాలా మందికి అర్థం కావడం లేదు. అసలు ఆ విధానం ప్రకారం లక్ష్యాలను ఎలా నిర్ణయిస్తారో కూడా స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ, ఇది చాలాకాలంగా క్రికెట్లో ఉపయోగిస్తున్నపద్ధతి,"అని వ్యాఖ్యానించారు. మ్యాచ్లు వర్షం లేదా ఇతర కారణాలతో అంతరాయం కలిగినప్పుడు,ముందుగా ఒక భారతీయుడు వి. జయదేవన్ రూపొందించిన VJD మెథడ్ అనే విధానం ప్రవేశపెట్టాడు. బీసీసీఐ దీన్ని దేశవాళీ క్రికెట్లో ఉపయోగించింది.కానీ ఇప్పుడు ఆ పద్ధతిని ఇంకా వాడుతున్నారో లేదో తెలియదు,"అని చెప్పారు. వర్షం వల్ల ఆట ఆగిపోయినప్పుడు ఇరుజట్లకూ న్యాయం జరిగే విధంగా టార్గెట్ నిర్ణయించే సిస్టమ్ ఉండాలి. లక్ష్యం ఎలా నిర్ణయించబడుతుందో,దాని ప్రమాణాలు ఏమిటో జట్లకు స్పష్టంగా వివరించాలని ఆయన సూచించారు.
వివరాలు
రోహిత్, కోహ్లీ విఫలం కావడం పై..
తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విఫలమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గవాస్కర్.. "భారత జట్టు బలమైనది. కేవలం నాలుగు-ఐదు నెలల క్రితమే ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. రోహిత్, కోహ్లీలు రానున్న మ్యాచ్ల్లో పెద్ద స్కోర్లు చేసినా ఆశ్చర్యం లేదు. చాలా కాలం తర్వాత వారు మైదానంలోకి దిగారు. నెట్స్లో త్రోడౌన్స్ ఆడారు. వాళ్లు ఫామ్లోకి వస్తే, భారత్ 300-320 పరుగులు చేయడం సులభం," అని గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు.