
Asia Cup 2025: నేడు ముంబైలో ఆసియా కప్ కోసం జట్టు ప్రకటన.. నలుగురు స్టార్ ఆటగాళ్ల భవిష్యత్తుపై ఉత్కంఠ!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు నేడు పుల్ స్టాప్ పడనుంది. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును మంగళవారం, ఆగస్టు 19న ముంబైలో ప్రకటించనున్నారు. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ మధ్యాహ్నం జరగబోయే ప్రెస్మీట్లో టీమిండియా స్క్వాడ్ను వెలువరించనున్నారు. చాలామంది ఆటగాళ్ల ఎంపిక దాదాపు ఖరారైనప్పటికీ నలుగురు స్టార్ ఆటగాళ్ల భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుండటంతో జట్టు ఎంపిక కొంత క్లిష్టంగా మారింది. గత ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్లో ఆడుతున్న జట్టు వేరు, టెస్టులు, వన్డేలు ఆడుతున్న జట్టు వేరు కావడం వల్ల, టెస్టు జట్టులో కీలక ఆటగాళ్లను టీ20 జట్టులోకి తీసుకోవచ్చా అనే చర్చ జరుగుతోంది.
Details
మీడియా ముందుకు రానున్న అగార్కర్
ఈ సమస్యను పరిష్కరించేందుకు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అజిత్ అగార్కర్తో పాటు సెలెక్షన్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొననున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ ఈ సమావేశంలో హాజరుపై ఇంకా స్పష్టత రాలేదు. మధ్యాహ్నం 1:30 గంటలకు అగార్కర్, సూర్యకుమార్ మీడియా ముందుకు వచ్చి జట్టును ప్రకటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యంగా నలుగురు ఆటగాళ్ల గురించి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నలుగురు ఆటగాళ్లలో ముఖ్యంగా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మధ్య పోటీ నెలకొంది.
Details
గిల్, జైస్వాల్లో ఒకరికి ఛాన్స్
వీరిద్దరూ టీ20 ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. కానీ గతేడాది కాలంగా టెస్ట్ క్రికెట్పై దృష్టి సారించడం వల్ల టీ20 జట్టుకు దూరమయ్యారు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో వీరిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. అయితే, ఇప్పుడు ఎవరికీ అవకాశం దక్కుతుందో చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ ఓపెనింగ్ జోడీ బాగా రాణిస్తున్నందున, వారికి మార్పులు చేసే అవకాశం తక్కువ. కాబట్టి, మూడో ఓపెనర్ లేదా బ్యాకప్ ఓపెనర్గా గిల్, జైస్వాల్లో ఒకరినీ ఎంపిక చేయాల్సి ఉంటుంది.