Yashasvi Jaiswal: ఆ కారణం వల్లే రియాన్ పరాగ్ను పక్కన పెట్టాం: యశస్వి జైస్వాల్
ఈ వార్తాకథనం ఏంటి
తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతోనే రియాన్ పరాగ్ను పక్కన పెట్టామని రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ యశస్వి జైస్వాల్ వెల్లడించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన జైస్వాల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని అతను చెప్పాడు. "మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్లా కనిపిస్తోంది. పైగా మ్యాచ్ సాగుతున్న కొద్దీ మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరించడం నాకు చాలా ప్రత్యేకం, ఎంతో గర్వంగా ఉంది. మా రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరాగ్కు తొడ కండరాల గాయం అయింది. అతను త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నాను.
వివరాలు
జడేజా గాయం నుంచి కోలుకుంటున్నాడు
జట్టులో మూడు మార్పులు చేశాం. మా జట్టు మైండ్సెట్ బాగుంది. సానుకూల దృక్పథంతో ఆడాలని అనుకుంటున్నాం. ముఖంపై చిరునవ్వుతో ఆటను ఆస్వాదించాలనుకుంటున్నాం. రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతనికి చిన్న నిగిల్ ఉంది. త్వరలోనే అతను ఫిట్ అవుతాడు" అని యశస్వి జైస్వాల్ తెలిపాడు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా మ్యాచ్పై ధీమా వ్యక్తం చేశాడు. "మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇది బ్యాటింగ్కు అనుకూలించే వికెట్. ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా మాకు పెద్దగా ఇబ్బంది లేదు.
వివరాలు
స్వదేశానికి వెళ్లిపోయిన మార్క్రమ్
మా ఫ్రాంచైజీ ఓనర్లు, అభిమానుల కోసం ఆడటం మాకు గర్వకారణమని అతను పేర్కొన్నాడు. అలాగే జట్టులో మార్పులపై కూడా పంత్ వివరించాడు. ఎయిడెన్ మార్క్రమ్ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లాడని తెలిపాడు. మహ్మద్ షమీ ఈ మ్యాచ్కు అందుబాటులో లేడని చెప్పాడు. అతని స్థానంలో మొహ్సిన్ ఖాన్ జట్టులోకి వచ్చాడని, ఎయిడెన్ మార్క్రమ్ స్థానంలో ఆయుష్ బదోని ఆడుతున్నాడని స్పష్టం చేశాడు.