Amol Muzumdar: ఇది చరిత్రాత్మక క్షణం.. భారత మహిళా జట్టుపై కోచ్ అమోల్ భావోద్వేగం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది. కోట్లాది అభిమానుల కలను సాకారం చేస్తూ టీమిండియా తొలిసారిగా ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ను (ICC Women's World Cup) కైవసం చేసుకుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయానంతరం భారత మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయం భారత క్రికెట్లో ఒక మలుపు బిందువుగా నిలుస్తుందని, దేశ క్రీడా భవిష్యత్తును ఇది పునర్నిర్వచించే ఘట్టమని ఆయన పేర్కొన్నారు.
Details
ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న షెఫాలీ వర్మ
విజయం ఖరారైన క్షణంలో ముజుందార్ భావోద్వేగానికి గురయ్యారు. తనకు మాటలు రావడం లేదని, ఈ జట్టును చూసి అపారమైన గర్వం కలుగుతోందన్నారు. వారి కఠోర శ్రమ, అచంచల విశ్వాసం, ఐక్యతే ఈ విజయానికి కారణం. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారని అన్నారు. 2023లో భారత మహిళల జట్టు బాధ్యతలు చేపట్టిన ముజుందార్, టోర్నమెంట్ మొత్తం జట్టు ప్రదర్శించిన పట్టుదల, సమష్టి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫైనల్ విజయం జట్టు సమష్టి ప్రదర్శన ఫలితమే అయినా, 21 ఏళ్ల యువ తార షెఫాలీ వర్మ ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యేకంగా నిలిచింది. బ్యాటింగ్లో 87 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ను భారత్ వైపుకు తిప్పింది.
Details
టీమిండియా ఫీల్డింగ్ అద్భుతం
ఆమె గురించి ముజుందార్ మాట్లాడుతూ షెఫాలీ అద్భుతమైన ఆటగాళ్లలో ఒకరు. సెమీస్, ఫైనల్ వంటి ఒత్తిడి భరితమైన మ్యాచ్లలోనూ ఆమె ఎప్పుడూ రాణిస్తుంది. పరుగులు, వికెట్లు, క్యాచ్లు అన్ని విభాగాల్లోనూ ఆమె తన ముద్ర వేసిందని ప్రశంసించారు. భారత్ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగులకే ఆలౌటైంది. బౌలర్లలో దీప్తి శర్మ 39 పరుగులకే 5 వికెట్లు తీసి సఫారీలపై విరుచుకుపడింది. అలాగే డెత్ ఓవర్లలో శ్రీ చరణి కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఫిట్నెస్, ఫీల్డింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఫలితమే ఈ విజయానికి పునాది అని ముజుందార్ వెల్లడించారు.