LOADING...
IPL: ఐపీఎల్ 2026లో ముస్తాఫిజుర్ భవితవ్యంపై బీసీసీఐ క్లారిటీ!
ఐపీఎల్ 2026లో ముస్తాఫిజుర్ భవితవ్యంపై బీసీసీఐ క్లారిటీ!

IPL: ఐపీఎల్ 2026లో ముస్తాఫిజుర్ భవితవ్యంపై బీసీసీఐ క్లారిటీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ 2026లో పాల్గొనగలడా అనే అంశంపై అనిశ్చితి నెలకొంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడుతున్న పరిస్థితుల్లో ఈ వ్యవహారంపై బీసీసీఐ స్పందించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లపై నిషేధం విధించే అంశాన్ని ప్రస్తుతం పరిశీలనలో ఉంచుతూ, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వేచి చూసే వైఖరిని అవలంబిస్తున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

కేకేఆర్ కొనుగోలుపై సోషల్ మీడియాలో వ్యతిరేకత 

ఇటీవల జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. అయితే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకోవడంపై కేకేఆర్ యాజమాన్యంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది రాజకీయ నేతలు కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో అవకాశం ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు.

వివరాలు 

బీసీసీఐ వైఖరి ఇదే 

ఈ వివాదంపై బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ, "ప్రస్తుత పరిస్థితి అత్యంత సున్నితంగా ఉంది. మేం ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అందే వరకు బంగ్లాదేశ్ ఆటగాళ్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. బంగ్లాదేశ్ శత్రు దేశం కాదు. అందువల్ల ప్రస్తుతానికి ముస్తాఫిజుర్ ఐపీఎల్‌లో ఆడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది" అని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

వీసా, ఎన్వోసీ అంశాలే కీలకం 

ముస్తాఫిజుర్ ఐపీఎల్‌లో పాల్గొనడం కేవలం బీసీసీఐ నిర్ణయంపైనే కాకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జారీ చేసే ఎన్వోసీపై కూడా ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ నెలలో బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడనుంది. ఆ సమయంలో బీసీబీ అతనికి ఎన్వోసీ ఇవ్వకపోతే, ముస్తాఫిజుర్ ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్‌కు రానున్న బంగ్లాదేశ్ జట్టు వీసా గడువును పొడిగించడం ద్వారా ముస్తాఫిజుర్ ఐపీఎల్‌లో ఆడేలా చేసేందుకు బీసీసీఐ విదేశీ వ్యవహారాల శాఖతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Advertisement