Adar Poonawalla: ఆర్సీబీ ఫ్రాంచైజీపై కన్నేసిన 'వ్యాక్సిన్ ప్రిన్స్'
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫార్మా దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్సీబీ యాజమాన్య హక్కుల కోసం తాను బలమైన, పోటీతో కూడిన బిడ్ వేయనున్నట్లు ఆయన గురువారం తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ను తయారు చేసి కోట్లాది మందికి ప్రాణరక్షణ అందించిన అదర్ పూనావాలా, అప్పట్లో 'వ్యాక్సిన్ ప్రిన్స్'గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
Details
గతేడాది అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే
అలాంటి బయో సైన్సెస్, వ్యాపార రంగ దిగ్గజం ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీ రేసులోకి దిగడం క్రికెట్, వ్యాపార వర్గాల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే గతేడాది నవంబర్లోనే ఆర్సీబీ మాతృసంస్థ యునైటెడ్ స్పిరిట్స్కు చెందిన డయాజియో ఈ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఆర్సీబీ తమ ప్రధాన ఆల్కహాల్ వ్యాపారంలో భాగం కాదని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ అప్పట్లో స్పష్టం చేసింది. అయితే 2025 జూన్లో ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న అనంతరం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల నిర్వహించిన విజయోత్సవాల్లో తొక్కిసలాట జరగడం, అందులో 11 మంది అభిమానులు మృతి చెందడం ఈ అమ్మకపు ప్రక్రియను మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
Details
ఫ్రాంచైజీ కొనుగోలు కోసం తీవ్రమైన పోటీ
అదర్ పూనావాలాతో పాటు, ప్రముఖ కన్నడ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ కూడా ఆర్సీబీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీంతో ఫ్రాంచైజీ యాజమాన్యం కోసం పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. మరోవైపు, 2026 ఐపీఎల్ సీజన్ను దృష్టిలో పెట్టుకొని తమ హోం మ్యాచ్లను బెంగళూరు నుంచి ఇతర నగరాలకు మార్చే అంశాన్ని ఆర్సీబీ యాజమాన్యం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, రాయ్పూర్లోని వీర్ నారాయణ్ సింగ్ స్టేడియాలను ప్రత్యామ్నాయ వేదికలుగా పరిశీలిస్తున్నారని సమాచారం.
Details
చిన్నస్వామి స్టేడియమే ఆర్సీబీ హోం గ్రౌండ్గా కొనసాగించాలి
అయితే, చిన్నస్వామి స్టేడియమే ఆర్సీబీ హోం గ్రౌండ్గా కొనసాగాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) స్పష్టం చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఆర్సీబీ టోర్నీలో ఒక కీలక ఫ్రాంచైజీగా కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం గతేడాది ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.