LOADING...
Vaibhav Suryavanshi : టీ20ల్లో 200 కొడతా.. క్రిస్ గేల్ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను!
టీ20ల్లో 200 కొడతా.. క్రిస్ గేల్ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను!

Vaibhav Suryavanshi : టీ20ల్లో 200 కొడతా.. క్రిస్ గేల్ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు బాదడం తనకు అలవాటైపోయిందని నిరూపిస్తున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ నిర్వహిస్తున్న 'ది స్విచ్' యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా "హాఫ్ సెంచరీ చేసినప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదు?" అని పీటర్సన్ ప్రశ్నించగా, వైభవ్ తన లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడించాడు. "నాకు 50 పరుగులు చేయడం అంతగా నచ్చదు. టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరూ చేయని విధంగా తొలి డబుల్ సెంచరీ చేయడమే నా లక్ష్యం.

వివరాలు

ఆ రికార్డు క్రిస్ గేల్ పేరిటే ఉంది

వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నాను" అని అతను ధీమాగా చెప్పాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు క్రిస్ గేల్ పేరిటే ఉంది. 2013 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన గేల్, పూణే వారియర్స్‌పై కేవలం 66 బంతుల్లో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదిన గేల్, కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును దాటి ఏకంగా 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ బీహార్ యువ సంచలనం.

వివరాలు

14 ఏళ్ల వయస్సులోనే అరంగేట్రం

గతేడాది కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్, ఈ సీజన్‌లో అసాధారణ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన అతను 41.64 సగటుతో, 232.27 స్ట్రైక్ రేట్‌తో 583 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 103 పరుగులు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 53 సిక్సర్లు బాదిన వైభవ్, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును అధిగమించేందుకు అతను కేవలం 7 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.

Advertisement

వివరాలు

35 బంతుల్లో శతకం

అంతేకాదు, గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లో శతకం బాది, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో కూడా వైభవ్ అదరగొట్టాడు. 7 మ్యాచ్‌ల్లో 62.71 సగటుతో, 169.49 స్ట్రైక్ రేట్‌తో 439 పరుగులు చేసి టోర్నీలో రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో ఏకంగా 30 సిక్సర్లు బాది, 2022లో దక్షిణాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ నెలకొల్పిన 18 సిక్సర్ల రికార్డును చెరిపేశాడు. అండర్-19 వన్డేల్లో భారత్ తరఫున 25 ఇన్నింగ్స్‌ల్లో 1,412 పరుగులు చేసి టాప్ రన్ గెట్టర్‌గా కొనసాగుతున్న వైభవ్, అక్టోబర్ 2024 నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.

Advertisement

వివరాలు

గతేడాది ఇంగ్లండ్ పై 52 బంతుల్లోనే సెంచరీ

ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై కేవలం 58 బంతుల్లో సెంచరీ బాది యూత్ టెస్టుల్లో వేగవంతమైన శతకం చేసిన భారతీయుడిగా నిలిచాడు. అదేవిధంగా గతేడాది ఇంగ్లాండ్‌పై 52 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై 61 బంతుల్లో 108 పరుగులు చేసి, ఆ టోర్నీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెంచరియన్‌గా రికార్డు సృష్టించాడు. రూ.1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకున్న ఈ యువ బ్యాటర్, తన ఐపీఎల్ కెరీర్‌ను మొదటి బంతికే సిక్స్ కొట్టి ప్రారంభించి ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Advertisement