Kohli-Messi: ముంబయికి చేరుకున్న విరాట్-అనుష్క.. మెస్సీని కలిసే అవకాశముందా?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) శనివారం ముంబయికి చేరుకున్నాడు. తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి స్వదేశానికి వచ్చిన కోహ్లీ, ఇటీవల సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్ అనంతరం లండన్కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే కుటుంబంతో కలిసి భారత్కు తిరిగి రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi)ను కలుసుకునేందుకే విరాట్-అనుష్క దంపతులు స్వదేశానికి వచ్చారని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా మెస్సీ మూడు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నాడు.
Details
హైదరాబాద్కు బయలుదేరిన మెస్సీ
ఈ క్రమంలో 14వ తేదీన ముంబయిలో మెస్సిని కోహ్లీ దంపతులు కలిసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే శనివారం కోల్కతాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లియోనెల్ మెస్సి అనంతరం హైదరాబాద్కు బయలుదేరాడు. శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో 'గోట్ కప్' పేరుతో నిర్వహించనున్న ఎగ్జిబిషన్ మ్యాచ్లో అర్జెంటీనా స్టార్ బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మెస్సితో కలిసి ఆడనున్నారు.
Details
పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు
ఎగ్జిబిషన్ మ్యాచ్ అనంతరం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లియోనెల్ మెస్సిని సన్మానించనున్నారు. ఈ భారీ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో సుమారు 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా మెస్సి 14న ముంబయిలో, 15న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. అనంతరం సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడంతో లియోనెల్ మెస్సి భారత పర్యటన ముగియనుంది.