Virat Kohli Record: క్వాలిఫయర్-1 మ్యాచుతో చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ.. అరుదైన రికార్డుకు చేరువ
ఈ వార్తాకథనం ఏంటి
విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతకు చేరువలో నిలిచాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో భాగంగా మే 26న గుజరాత్ టైటాన్స్తో జరిగే క్వాలిఫయర్-1మ్యాచ్లో బరిలోకి దిగనున్న విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతం 281మ్యాచ్లతో రోహిత్ శర్మతో కలిసి అగ్రస్థానంలో ఉన్న విరాట్.. గుజరాత్పై ఆడగానే 282 మ్యాచ్లతో టోర్నీ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా కొత్త రికార్డు సృష్టించనున్నాడు. దీంతో కనీసం ఐపీఎల్ 2027వరకు ఈ ఘనత అతడి పేరిట కొనసాగనుంది. ఇక ఐపీఎల్ 2026 లీగ్ దశతోనే రోహిత్ శర్మ ప్రస్థానం ముగిసింది. ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించకపోవడంతో హిట్మ్యాన్కు ఈ సీజన్లో ఇక మ్యాచ్లు ఆడే అవకాశం లేకుండా పోయింది.
వివరాలు
మూడో స్థానంలో ధోని
మరోవైపు ఎంఎస్.ధోని 278 మ్యాచ్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు వరకు అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా ధోనీ కొనసాగాడు. అయితే ఈ సీజన్లో కాలి కండరాల గాయం కారణంగా మొత్తం టోర్నీకే దూరమవడంతో.. విరాట్, రోహిత్ ఇద్దరూ అతడిని అధిగమించారు. కోహ్లీకి ఈ సీజన్లో కనీసం మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఓడినా.. క్వాలిఫయర్-2 ద్వారా ఫైనల్కు చేరితే అతడు మొత్తం మూడు మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. దీంతో అతడి రికార్డు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.