LOADING...
Virat Kohli: కోహ్లీ వరుస శతకాల తర్వాత .. విశాఖలో జోరందుకున్న టికెట్ల అమ్మకాలు!
Kohli: కోహ్లీ వరుస శతకాల తర్వాత .. విశాఖలో జోరందుకున్న టికెట్ల అమ్మకాలు!

Virat Kohli: కోహ్లీ వరుస శతకాల తర్వాత .. విశాఖలో జోరందుకున్న టికెట్ల అమ్మకాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖపట్టణంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌పై మొదట్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. అయితే, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి వరుసగా రెండు సెంచరీలు బాదడంతో ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లకు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ తరహా స్పందన చాలా అరుదుగా కనిపిస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ (ఏసీఏ) అధికారులు వెల్లడించారు. నవంబర్‌ 28న ఆన్‌లైన్‌లో తొలి దశ టికెట్ల విక్రయం ప్రారంభమైనప్పుడు ఆశించినంతగా స్పందన రాలేదు. దీంతో ఆఫ్‌లైన్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయాలనే యోచనకు ఏసీఏ వచ్చిందని సమాచారం.

వివరాలు 

విశాఖలో కోహ్లీకి అద్భుతమైన రికార్డు 

కానీ రాంచీ, రాయ్‌పూర్‌లలో కోహ్లీ వరుసగా శతకాలు సాధించడంతో అభిమానుల ఉత్సాహం ఒక్కసారిగా జోరందుకుంది. "రాంచీ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ అనంతరం రెండో, మూడో దశ టికెట్లు నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. ఒక్క టికెట్ కూడా అందుబాటులో మిగలలేదు," అని ఏసీఏ మీడియా ప్రతినిధి వై. వెంకటేశ్ తెలిపారు. విశాఖపట్నంలో కోహ్లీకి ఉన్న అద్భుత రికార్డు కూడా ఈ క్రేజ్‌కు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇక్కడ ఆయన ఆడిన ఇప్పటివరకు ఏడు వన్డేల్లో సగటు 97.83 పరుగులతో మూడు సెంచరీలు,ఓ సారి 99, మరోసారి 65 పరుగులు నమోదు చేశారు. ఈ నేప‌థ్యంలో టికెట్ ధరలు రూ.1,200 నుంచి రూ.18,000 వరకు ఉన్నప్పటికీ అభిమానులు ఏమాత్రం వెనుకంజ వేయకుండా భారీగా కొనుగోలు చేశారు.

వివరాలు 

విశాఖ చేరుకున్న టీమిండియా 

కోహ్లీ ఫామ్‌తో పాటు అభిమానుల ఉత్సాహం విమానాశ్రయాల్లో కూడా స్పష్టంగా కనపడింది. భారత జట్టు రాక కోసం విశాఖ ఎయిర్‌పోర్టులో అభిమానులు గంటల తరబడి ఎదురు చూశారు. రాయ్‌పూర్ నుంచి విమానం ఆలస్యమైనా సహనంగా వేచిచూశారు. అటు రాయ్‌పూర్ విమానాశ్రయంలో కూడా ఇదే తరహా వాతావరణం నెలకొంది. విమానాల ఆలస్యంపై అసహనంతో ఉన్న ప్రయాణికులు సైతం కోహ్లీ దర్శనం ఇవ్వగానే తమ అసంతృప్తిని మరిచి కేరింతలతో స్వాగతం పలికారు. ప్రస్తుతం టీమిండియా విశాఖ చేరుకుంది. ఆదివారం జరగనున్న ఈ కీలక మ్యాచ్ సందర్భంగా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోవడం దాదాపు ఖాయంగా మారింది.

Advertisement