Smriti Mandhana- Palash Muchhal: స్మృతి మంధానతో పెళ్లి వాయిదా… తొలిసారిగా మీడియాకు కనిపించిన పలాశ్ ముచ్చల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన(Smriti Mandhana)- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) వివాహం గత నెల 23న జరగాల్సి ఉండగా, అనుకోని పరిస్థితుల కారణంగా ఆ వేడుక వాయిదా పడింది. అదే రోజు మంధాన తండ్రి శ్రీనివాస్కు గుండెపోటు లక్షణాలు కనిపించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ కారణంగా మంధాన, వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆమె మేనేజర్ వెల్లడించారు. అనంతరం పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రి చేరాడు. ప్రస్తుతం ఇద్దరూ డిశ్చార్జ్ అయ్యినప్పటికీ, పెళ్లి కొత్త తేదీపై అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ సందర్భంలో పలాశ్ ముచ్చల్ తాజాగా అతడి తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి ముంబయి విమానాశ్రయంలో మీడియాకు దర్శనమిచ్చాడు.
Details
ఊహాగానాలు చెక్
ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, వివాహం వాయిదా తర్వాత మంధాన తన ఇన్స్టాగ్రామ్లో పెళ్లికి సంబంధించిన పోస్టులను తొలగించడంతో, నెట్టింట రెండింటి మధ్య విభేదాలు వచ్చాయోమో అనే సందేహాలు వ్యాపించాయి. అదే సమయంలో పలాశ్ మరో మహిళతో స్మృతిని కించపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ కొన్ని చాట్ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. వీటి తరువాత పలువురు అనేక ఊహాగానాలు ప్రారంభించారు. అయితే ఈ ప్రచారాలన్నింటికీ చెక్ పెడుతున్నట్లు, స్మృతి - పలాశ్ ఇద్దరూ ఇటీవల తమ ఇన్స్టాగ్రామ్ బయోల్లో 'దిష్టి రక్ష' ఎమోజీ (Nazar Amulet)ను చేర్చుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు లేవని అభిమానులు భావిస్తున్నారు.
Details
త్వరలోనే వివాహం జరుగుతుంది
ఇక పలాశ్ తల్లి అమిత ముచ్చల్ ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందని, త్వరలోనే వివాహం జరుగుతుందని తెలిపింది. "స్మృతి, పలాశ్ ఇద్దరూ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. పలాశ్ స్మృతిని జీవిత భాగస్వామిగా ఇంటికి తీసుకురావాలని ఎంతగానో ఎదురుచూశాడు. నేను సైతం వారికి ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది. వీరి వివాహం త్వరలోనే జరుగుతుందని ఆమె వెల్లడించింది. అయితే మంధాన కుటుంబం వైపు నుంచి మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన ఏదీ లేనట్లు తెలిసింది.