Virat Kohli: ఒక ఫార్మాట్లోనే కొనసాగుతా… టెస్టులపై రూమర్స్కి ఫుల్ స్టాప్ : విరాట్ కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా సిరీస్ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ టెస్టుల్లోకి రావచ్చన్న ప్రచారానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వయంగా పూర్తి బ్రేక్ వేశాడు. తొలి వన్డేలో శతకం బాదిన విరాట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న తర్వాత వచ్చిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంతో అన్ని రూమర్లకు ముగింపు పలికాడు. మరి కోహ్లీ ఏమన్నారు? ప్రశ్న: భవిష్యత్తులోనూ ఒకే ఫార్మాట్లోనే ఆడతావా? పునరాలోచించే అవకాశం ఉందా? విరాట్ సమాధానం: "అవును... నేను ఇకపై ఒకే ఫార్మాట్లోనే ఆడతాను. అదే కొనసాగుతుంది."
Details
300పైగా వన్డేలు ఆడిన అనుభవం
ఆ తర్వాత మ్యాచ్లో తన బ్యాటింగ్పై మాట్లాడుతూ 16 ఏళ్లలో 300కు పైగా వన్డేలు ఆడాను. బంతితో నేను ఎప్పుడూ టచ్లో ఉంటాను. ప్రాక్టీస్లోనూ హిట్టింగ్పైనే దృష్టి పెట్టుతాను. నెట్స్లో వరుసగా రెండు గంటలు శ్రమిస్తే, దాని ప్రభావం తప్పకుండా మ్యాచ్లో కనిపిస్తుంది. క్రమంగా ఆడితే ఫామ్లోకి రావడం చాలా సులభం. ఇటువంటి సందర్భాల్లో నాకు ఉన్న అనుభవం కీలకం అవుతుంది. శారీరకంగా ఎప్పుడూ ఫిట్గా ఉంటాను. మానసికంగా కూడా మ్యాచ్ల కోసం రెడీగా, ఉత్సాహంగా ఉంటా. రాంచీలో కూడా అదే ఆత్మవిశ్వాసం చూపాను. ఇప్పుడు నా వయస్సు 37.
Details
మానసికంగా బలంగా ఉండాలి
కానీ ఇంకా ప్రతి మ్యాచ్కు ముందు రోజు... బౌలర్లు, ఫీల్డర్లు, పరిస్థితులు అన్నింటినీ మదిలో విజువలైజ్ చేసుకుంటా. రాంచీ పిచ్ మొదటి 25 ఓవర్లలో ఒకలా, ఆ తర్వాత మరోలా ప్రవర్తించింది. అందుకే బంతిని గమనించి, వేచి చూసి ఆడాలని నిర్ణయించుకున్నా. దానికి అనుగుణంగానే స్ట్రాటజీ మార్చుకున్నా. కేవలం కఠిన సాధనతో మాత్రమే కాదు... మానసికంగా ముందే రెడీ అయి ఉండటం ముఖ్యం. ఫిట్నెస్ నాకు సమస్య కాదు. మానసికంగా బలంగా ఉంటే మెరుగైన ఆటతీరు చూపడం సాధ్యమని కోహ్లీ తెలిపాడు. ఈ వ్యాఖ్యలతో, దేశవాళీ క్రికెట్లో ఆడమన్న బీసీసీఐ సూచనను విరాట్ సున్నితంగా నిరాకరించినట్టే కనిపిస్తోంది.