LOADING...
WTC final 2027 : క్రికెట్ చరిత్రలో అరుదైన నిర్ణయం..2027 ఫైనల్ వేదిక మారే అవకాశాలు
క్రికెట్ చరిత్రలో అరుదైన నిర్ణయం..2027 ఫైనల్ వేదిక మారే అవకాశాలు

WTC final 2027 : క్రికెట్ చరిత్రలో అరుదైన నిర్ణయం..2027 ఫైనల్ వేదిక మారే అవకాశాలు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 21, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫైనల్ లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగాల్సి ఉంది. అయితే ఇటీవల అక్కడ జరిగిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ టెస్టు కేవలం 166 ఓవర్లలోనే ముగియడం పిచ్ నాణ్యతపై తీవ్ర చర్చకు దారితీసింది. బ్యాటర్లకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన ఈ పిచ్‌పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పిచ్‌కు "అన్‌సాటిస్‌ఫాక్టరీ" రేటింగ్ ఇవ్వడమే కాకుండా, లార్డ్స్ చరిత్రలో తొలిసారి ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా నమోదు చేసింది.

వివరాలు

ది ఓవల్‌కు ఫైనల్ వేదిక మారే అవకాశం..

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక పోరుగా భావించే డబ్ల్యూటీసీ ఫైనల్ ఐదు రోజుల పాటు బ్యాటర్లు, బౌలర్ల మధ్య సమతుల్య పోటీని అందించాలనే లక్ష్యంతో ఐసీసీ వ్యవహరిస్తోంది. కానీ లార్డ్స్ పిచ్‌లో అసాధారణ బౌన్స్, ఎక్కువ సీమ్ మూవ్‌మెంట్ కారణంగా మ్యాచ్ వేగంగా ముగిసిపోయింది. మొత్తం 40 వికెట్లు పడగా, వాటిలో 24 వికెట్లు బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ రూపంలో నమోదయ్యాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా 2027 డబ్ల్యూటీసీ ఫైనల్‌ను లండన్‌లోని ది ఓవల్ మైదానానికి మార్చే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే వేదికపై 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ విజయవంతంగా నిర్వహించిన అనుభవం కూడా ఉంది.

వివరాలు

విమర్శలను అంగీకరించిన ఎంసీసీ..

లార్డ్స్ మైదాన నిర్వహణ బాధ్యతలు చూసే మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) పిచ్‌పై వచ్చిన విమర్శలను అంగీకరించింది. అయితే గతంలో ఇదే మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ మ్యాచ్‌ల పిచ్‌లకు మంచి రేటింగ్‌లు లభించాయని క్లబ్ గుర్తుచేసింది. ఎంసీసీ క్రికెట్ డైరెక్టర్ రాబ్ లించ్ మాట్లాడుతూ, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ తీవ్రంగా ఉండటంతో ప్రతి మ్యాచ్‌కు అత్యుత్తమ పిచ్‌ను సిద్ధం చేయడం క్యూరేటర్లకు పెద్ద సవాలుగా మారిందని చెప్పారు. డబ్ల్యూటీసీ 2027 ఫైనల్‌కు ఇంకా సుమారు ఏడాది సమయం ఉండటంతో, వేదిక మార్పుపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), ఐసీసీ కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

వివరాలు

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆధిపత్యం చాటుతున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా

2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 87.50 శాతం పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉన్న ఆ జట్టు ఇప్పటివరకు ఎనిమిది టెస్టులు ఆడింది. డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా 75 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే ప్రోటీస్ జట్టు ఇప్పటివరకు కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడింది. దీంతో టెంబా బవుమా నాయకత్వంలోని సౌతాఫ్రికాకు రాబోయే మ్యాచ్‌ల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకునే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

వివరాలు

భారత్, ఇంగ్లాండ్‌కు కఠిన పరిస్థితులు..

గత రెండు డబ్ల్యూటీసీ ఎడిషన్లలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు ఈసారి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. తొమ్మిది టెస్టుల్లో నాలుగు విజయాలకే పరిమితమైన టీమిండియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇంగ్లాండ్ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. 11 టెస్టుల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించిన ఆ జట్టు ఏడో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు 2027 డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన సిరీస్‌ల్లో వరుస విజయాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఫైనల్ వేదిక ది ఓవల్‌కు మారినప్పటికీ, లార్డ్స్ మైదానంలో నిర్వహించే ఇంగ్లాండ్ సాధారణ టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని సమాచారం.

Advertisement