Page Loader
హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి 
హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి

హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Oct 07, 2023
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని షార్ హనీగేవ్ రీజియన్ మేయర్ ఓఫిర్ లిబ్‌స్టెయిన్‌తో సహా కనీసం 22మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడులలో 500 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో అనేకమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి పౌరులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే మేయర్ లిబ్స్టెయిన్‌ను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. ఇజ్రాయెల్ ప్రతీకారంగా హమాస్ గ్రూప్‌ను ఎదుర్కొనేందుకు 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్'ను ఏర్పాటు చేసింది. గాజా స్ట్రిప్‌పైకి వైమానిక దాడులను ప్రారంభించింది.

ఇజ్రాయెల్

హమాస్ తీవ్రమైన తప్పు చేసింది: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు యుద్ధాన్ని ప్రకటించడంపై ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ స్పందించారు. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రధాన కార్యాలయంలో భద్రతా మంత్రివర్గ సమావేశం తర్వాత గాలంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడులతో హమాస్ తీవ్రమైన తప్పు చేసిటన్లు పేర్కొన్నారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ యుద్ధాన్ని ప్రారంభించిందని, ఇందులో ఇజ్రాయెల్ గెలుస్తుందని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న దురాగతాలకు ప్రతిస్పందనగా గ్రూప్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు హమాస్ ప్రతినిధి ఖలీద్ ఖడోమీ చెప్పారు. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన ఆకస్మిక దాడిని యూకే ఖండిస్తున్నట్లు యునైటెడ్ కింగ్‌డమ్ విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ చెప్పారు. జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ కూడా ఈ దాడులను తప్పుబట్టారు.