నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి
సెంట్రల్ నైజీరియాలో ఆదివారం బందిపోట్లు జరిపిన ఆకస్మిక దాడిలో నైజీరియా భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గాయపడిన వారిని రక్షించేందుకు సోమవారం వెళ్లిన హెలికాప్టర్ను కూడా బందిపోట్లు కూల్చిశారు. అయితే ఆ హెలికాప్టర్లో ఉన్నవారు చనిపోయారా? లేక ప్రాణాలతో బయటపడ్డారా? అనేది తెలియాల్సి ఉందని వైమానిక దళ ప్రతినిధి చెప్పారు. సైనికులకు బందిపోట్లకు మధ్య కాల్పులు ఇంకా జరుగుతున్నాయని, ఇప్పటి వరకు తాము ముగ్గురు అధికారులు సహా 26 మంది సైనికులను కోల్పోయామని సైన్యం తెలిపింది. హెలికాప్టర్లో వెళ్లిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని అధికారులు చెప్పారు.