LOADING...
Philippines: ఫిలిప్పీన్స్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు విద్యార్థులు మృతి, ఐదుగురికి గాయాలు
ఫిలిప్పీన్స్ స్కూల్‌లో కాల్పులు.. 3 విద్యార్థులు మృతి, ఐదుగురికి గాయాలు

Philippines: ఫిలిప్పీన్స్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు విద్యార్థులు మృతి, ఐదుగురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 22, 2026
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిలిప్పీన్స్‌లోని టాక్లోబన్ నగరంలో ఉన్న శాన్ జోస్ నేషనల్ హైస్కూల్‌లో సోమవారం (జూన్ 22) ఉదయం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత జరిగిన ఈ ఘటనపై టాక్లోబన్ సిటీ పోలీస్ కార్యాలయం (TCPO) దర్యాప్తు చేపట్టింది. ఘటన జరిగిన కొద్ది నిమిషాలకే 15 ఏళ్ల తొమ్మిదో తరగతి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన వారిలో ఇద్దరూ మైనర్లేనని అధికారులు ధృవీకరించారు.

వివరాలు 

బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం: పోలీసులు

ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు, ఇందులో పాల్గొన్న వారందరి పాత్ర, కాల్పులకు దారితీసిన ఉద్దేశ్యం ఏమిటన్న అంశాలపై విస్తృత స్థాయిలో విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా,ఈ ఘటనపై ఫిలిప్పీన్స్ విద్యాశాఖ ప్రాంతీయ కార్యాలయం(DepEd Regional Office VIII) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో భయాందోళనలకు గురైన విద్యార్థులు,ఉపాధ్యాయులు,కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. బాధిత పాఠశాల సమాజానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొంది. అలాగే విద్యాసంస్థలు సురక్షితంగా ఉండేలా భాగస్వామ్య సంస్థలతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ఘటన నేపథ్యంలో టాక్లోబన్ నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తరగతులను తాత్కాలికంగా నిలిపివేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫిలిప్పీన్స్ న్యూస్ ఏజెన్సీ చేసిన ట్వీట్ 

Advertisement