ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి
ఇటలీలోని లాంపెడుసా ద్వీపం సమీపంలోని సెంట్రల్ మధ్యదరా సముద్రంలో గత వారం ఓడ ప్రమాదంలో 41మంది వలసదారులు మరణించారని అన్సా వార్తా సంస్థ బుధవారం నివేదించింది. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రాణాలతో బయటపడినట్లు చెప్పింది. ప్రమాద సమయంలో పడవలో 45 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వలస సంక్షోభానికి హాట్ స్పాట్ అయిన ట్యునీషియాలోని స్ఫాక్స్ నుంచి గురువారం ఉదయం పడవ బయలుదేరింది. అయితే బయలుదేరిన కొన్ని గంటలకే ఓడ బోల్తా పడి మునిగిపోయిందని ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఐవరీ కోస్ట్, గినియాకు చెందిన ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వారిని కార్గో షిప్ సహాయంతో రక్షించి, ఆపై ఇటాలియన్ కోస్ట్ గార్డ్ నౌకలోకి తరలించారు.