Ceuta Crisis: 24 గంటల్లో 60 వేల మంది చొరబాటు.. సెయూటాలో అత్యవసర పరిస్థితి!
ఈ వార్తాకథనం ఏంటి
స్పెయిన్కు చెందిన సెయూటా నగరంలో భారీ వలస సంక్షోభం నెలకొంది. మొరాకో నుంచి కేవలం 24 గంటల వ్యవధిలోనే దాదాపు 60 వేల మంది వలసదారులు నగరంలోకి చొరబడ్డారని సెయూటా అధ్యక్షుడు జువాన్ జీసస్ వివాస్ వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. కేవలం 85 వేల మంది జనాభా ఉన్న సెయూటా నగరంలో ఒకేసారి 60 వేల మంది ప్రవేశించేందుకు ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వెల్లడించారు. ఈ భారీ సరిహద్దు ఉల్లంఘనలను స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామాలకు మానవ అక్రమ రవాణా ముఠాలే ప్రధాన కారణమని ఆరోపించారు.
వివరాలు
సరిహద్దులో సైన్యం మోహరింపు
యువతను మోసగించి ప్రమాదకర మార్గాల్లో యూరప్కు పంపిస్తూ, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్ ప్రభుత్వం వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించింది.
సెయూటాలోకి ప్రవేశించేందుకు సరిహద్దు సమీపంలోని ఎత్తైన ప్రాంతాల్లో గుమిగూడిన వందలాది మంది వలసదారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ను ప్రయోగించాయి.
అయినప్పటికీ, పలువురు వలసదారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో ఈదుకుంటూ స్పెయిన్ భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది.