Jordan: అమెరికా స్థావరంపై ఇరాన్ మిసైల్ అటాక్.. ఏ-10, ఎఫ్-15 సైనిక విమానాలు ధ్వంసం..
ఈ వార్తాకథనం ఏంటి
జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో దాడికి దిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో ఒక ఏ-10 థండర్బోల్ట్ విమానంతో పాటు ఎనిమిది ఎఫ్-15 ఫైటర్ జెట్లు దెబ్బతిన్నట్లు సమాచారం. ఏ-10 విమానం ఎడమ రెక్క పూర్తిగా విరిగిపోయినట్లు తెలుస్తోంది.ఎఫ్-15 యుద్ధ విమానాలకు మాత్రం స్వల్ప స్థాయిలో నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ వివరాలను అంతర్జాతీయ మీడియా సంస్థ సీబీఎస్కు చెందిన రిపోర్టర్ జెన్నీఫర్ జాకబ్స్ వెల్లడించారు. ఈ మేరకు ఆమె గురువారం ఉదయం తన 'ఎక్స్' ఖాతాలో పోస్టు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ క్షిపణి దాడులను ఎదుర్కొనేందుకు జోర్డాన్లో ఉన్న అమెరికా దళాలు 30కిపైగా పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించాయి.
వివరాలు
జోర్డాన్లోని ముఫావక్ సాల్టీ ఎయిర్బేస్ లక్ష్యం
అంతకుముందు అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
ఆ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు సమాచారం.
అమెరికా చేపట్టిన ఈ చర్యల అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినట్లు వివరించారు.
తమ దళాలు అమెరికాకు చెందిన ఎనిమిది చమురు ట్యాంకర్లు, రెండు యుద్ధ నౌకలపై దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించినట్లు జాకబ్స్ తన పోస్టులో తెలిపారు.
అలాగే జోర్డాన్లోని ముఫావక్ సాల్టీ ఎయిర్బేస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
వివరాలు
ఆ ఎన్నికల తర్వాత ఇరాన్తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నవంబర్లో జరిగే మిడ్టర్మ్ ఎన్నికల తర్వాత ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.
బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు పూర్తయిన వెంటనే యుద్ధం ఆగిపోయే అవకాశముందని అన్నారు.
ఇరాన్ ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితుల్లో లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా మిడ్టర్మ్ ఎన్నికలపై ప్రభావం చూపేందుకు టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
''ఎన్నికలు పూర్తయిన వెంటనే యుద్ధం ఆగే అవకాశం ఉందని భావిస్తున్నాను. ఇరాన్ ఎక్కువ కాలం ఈ యుద్ధాన్ని కొనసాగించలేకపోవచ్చు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు టెహ్రాన్ గట్టిగా ప్రయత్నిస్తోంది'' అని ట్రంప్ పేర్కొన్నారు.