Page Loader
Aga Khan: ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్‌ కన్నుమూత
ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్‌ కన్నుమూత

Aga Khan: ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్‌ కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత బిలియనీర్‌, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు అయిన ఆగాఖాన్‌ (Aga Khan) ఇక లేరు. ఆయన పోర్చుగల్‌లోని లిస్బన్‌లో తుదిశ్వాస విడిచారని ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆగాఖాన్‌ కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ సమాజానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని ఫౌండేషన్ ప్రకటించింది. మతపరమైన విభేదాలను దాటుకుని, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన కలలు కన్నట్లు, తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని తెలిపింది.

వివరాలు 

ఆగాఖాన్‌ జీవిత ప్రయాణం 

88 ఏండ్లు పూర్తి చేసుకున్న ఆగాఖాన్‌ బ్రిటన్‌ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఆయన స్విట్జర్లాండ్‌లో జన్మించారు. 1957లో, తన వయస్సు 20 ఏళ్లుకాగానే, ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్‌గా నియమితులయ్యారు. తన కుటుంబ వారసత్వంగా కొనసాగుతున్న గుర్రపు పెంపకం రంగంతో పాటు అనేక వ్యాపారాల్లో విశేష ప్రతిభను ప్రదర్శించారు. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ వంటి దేశాల్లో నిర్వహించే గుర్రాల పందెంలో పాల్గొన్నారు. ఆయన షేర్గర్‌ జాతికి చెందిన గుర్రంతో పలు రేసుల్లో ప్రదర్శన ఇచ్చారు.

వివరాలు 

ఆగాఖాన్‌ సేవా కార్యక్రమాలు 

1967లో, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని, ఆయన ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌‌ను స్థాపించారు. ఈ నెట్‌వర్క్‌ ప్రపంచవ్యాప్తంగా వందలాది దవాఖానలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేసింది. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి, 2015లో దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్‌‌ను అందజేసింది. ఈ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు ప్రదానం చేశారు.

వివరాలు 

ఇస్మాయిలీ ముస్లిం జనాభా 

ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల మంది ఇస్మాయిలీ ముస్లింలు ఉన్నారు. వీరిలో 5 లక్షల మంది పాకిస్థాన్‌లో నివసిస్తున్నారు. అలాగే, భారత్‌, అఫ్ఘానిస్థాన్‌, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో కూడా ఇస్మాయిలీ ముస్లింల జనాభా గణనీయంగా ఉంది.