
Al Qaeda: బెంగళూరులో అల్ఖైదా మాడ్యుల్ మాస్టర్మైండ్ షామా పర్వీన్ అరెస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
అల్ఖైదా (AQIS) అనుబంధ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించిన కీలక మాస్టర్మైండ్ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మాడ్యూల్కు ప్రధాన కుట్రదారుగా గుర్తింపు పొందిన 30 ఏళ్ల షామా పర్వీన్ను కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేసినట్లు చెప్పారు. దేశంలో ఉగ్రవాద శక్తులకు మద్దతిస్తున్న వారిని గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం. షామా పర్వీన్ కర్ణాటక నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు సాయం చేస్తోందని దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. జులై 23న ఈ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించి మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీ, మహమ్మద్ ఫైక్ అనే నలుగురు అనుమానితులను గుజరాత్, ఢిల్లీ, నోయిడాల్లో అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
Details
స్లీపర్ సెల్ నెట్వర్క్లతో సంబంధాలు
ఈ నలుగురు అనుమానితులు ఓ రహస్యమైన, ఆటో డిలీటెడ్ చాట్ యాప్ ద్వారా పరస్పరంగా కమ్యూనికేట్ అవుతుండగా అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ గ్రూప్కు అనుబంధ సభ్యులు ఉన్నారని, వీరందరికీ షామా పర్వీన్ నాయకత్వం వహిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేయాలని ఈ మాడ్యూల్ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈగ్రూప్కి అల్ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పాటు స్లీపర్ సెల్ నెట్వర్క్లతో సంబంధాలు ఉన్నట్టు తెలిపారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం విదేశీ ఉగ్ర ముఠాలకు అందజేస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే అరెస్టైన నిందితుల నుంచి లభించిన సమాచారంతో ఇతర ఉగ్ర మద్దతుదారులు,చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.