Ecuador TV Studio: లైవ్ షోలో న్యూస్ యాంకర్పై తుపాకులు ఎక్కుపెట్టిన ముష్కరులు
తుపాకులతో కొందరు దుండగులు టీవీ ఛానెల్ లైవ్ స్టూడియోలోకి ప్రవేశించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఈక్వెడార్ రాజధాని గ్వయకిల్లో మంగళవారం జరిగింది. మాస్క్లు ధరించి వచ్చిన ముష్కరులు తుపాకులు, డైనమైట్లతో లైవ్ స్టూడియోలో వార్తలు చదువుతున్న న్యూస్ ప్రసెంటర్తో పాటు అక్కడున్న ఉద్యోగులను బెదిరించారు. ఉద్యోగులను కింద కూర్చోబెట్టి వారి తలలపై తుపాకులు ఎక్కుపెట్టారు. ఇదంతా టీవీ ఛానెల్లో లైవ్ ప్రసారమైంది. లైవ్ లోనే తుపాకీ శబ్దాలు కూడా వినిపించాయి. ఈ ఘటనపై గ్వయకిల్ పోలీసులు స్పందించారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని చెప్పారు.
ఇద్దరు డ్రగ్ గ్యాంగ్స్టర్ల పైనే అనుమానాలు
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 13మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై ఉగ్రవాద చర్యల కింద కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారనే విషాయన్ని మాత్రం చెప్పలేదు. ఈక్వెడార్ జైళ్ల నుంచి ఇటీవల ఇద్దరు డ్రగ్ గ్యాంగ్స్టర్లు పారిపోయారు. వీరు తప్పించుకున్న తర్వాత ఆ దేశంలో హింసాత్మక ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. కొందరు పోలీసు అధికారులు కిడ్నాప్కు గురయ్యారు. ఈ క్రమంలో ఈక్వెడార్ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి విధించింది. ఈ ఘటనల వెనుక డ్రగ్ గ్యాంగ్స్టర్లు ఉండొచ్చని ఈక్వెడార్ ప్రభుత్వం అనుమానిస్తోంది.