Narendra Modi: విదేశీ పర్యటనకు ముందు ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు రోజుల్లో మూడు దేశాల పర్యటనను ప్రారంభించనున్నారు. జులై 6 నుంచి ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన అధికారిక పర్యటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని హత్య చేస్తామని సోషల్ మీడియాలో ఒక వ్యక్తి చేసిన బెదిరింపు వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు విచారణ ప్రారంభించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
వివరాలు
భద్రతా ఏర్పాట్లు పటిష్టం..
పర్యటన షెడ్యూల్ ప్రకారం జులై 8న ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. అనంతరం జులై 9న నిర్వహించనున్న 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టు కింద ఓ వ్యక్తి ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు, బెదిరింపు సందేశం పోస్ట్ చేసిన వ్యక్తికి సంబంధించిన ఐపీ అడ్రస్ను గుర్తించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ పాల్గొనే కార్యక్రమానికి అదనపు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.