Loading...
Bangladesh: బంగ్లాదేశ్‌ను వణికిస్తున్న మీజిల్స్‌.. 1.66 లక్షలు దాటిన కేసులు.. 1,000కి చేరిన మృతులు
1,000కి చేరిన మృతులు

Bangladesh: బంగ్లాదేశ్‌ను వణికిస్తున్న మీజిల్స్‌.. 1.66 లక్షలు దాటిన కేసులు.. 1,000కి చేరిన మృతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మీజిల్స్‌(తట్టు)వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ కనిపించనంత స్థాయిలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ విజృంభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా 1.66లక్షలకు పైగా అనుమానిత మీజిల్స్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీహెచ్‌ఎస్‌) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా అనుమానిత మరణాల సంఖ్య కూడా 1,000కు చేరువైంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ).. దీనిని జాతీయ స్థాయిలో అధిక ప్రమాద సంక్షోభంగా పరిగణించింది. దేశంలోని 64 జిల్లాల్లోనూ మీజిల్స్‌ వ్యాప్తి నమోదైంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని ఢాకాలోని నివాస ప్రాంతాలు, మురికివాడలు వ్యాధి వ్యాప్తికి ప్రధాన కేంద్రాలుగా మారాయి.

వివరాలు 

ఐదేళ్లలోపు చిన్నారులే సుమారు 80 శాతం

నమోదవుతున్న కేసుల్లో ఐదేళ్లలోపు చిన్నారులే సుమారు 80 శాతం ఉన్నారు.

తొమ్మిది నెలలలోపు శిశువుల్లోనే దాదాపు మూడో వంతు ఇన్‌ఫెక్షన్లు నమోదవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

చిన్నారుల్లో పోషకాహార లోపం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తోంది.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల మీజిల్స్‌తో బాధపడుతున్న పిల్లల్లో న్యూమోనియా, మెదడువాపు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం పెరుగుతోంది.

వివరాలు 

టీకాల కొరతతో రోగనిరోధక శక్తి లోపం

జనాభాలో మీజిల్స్‌ నుంచి రక్షణ కల్పించే రోగనిరోధక శక్తి తగిన స్థాయిలో లేకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణమని బంగ్లాదేశ్‌ ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

ముఖ్యంగా టీకాలు అందుబాటులో లేకపోవడం, తగిన స్థాయిలో టీకాలు వేయకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో చిన్నారులు ఈ వ్యాధికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది.

మీజిల్స్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవాలంటే రెండు డోసుల టీకాతో కనీసం 95 శాతం జనాభాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలు సూచిస్తున్నాయి.

అయితే ఇటీవలి సంవత్సరాల్లో బంగ్లాదేశ్‌ ఈ స్థాయి టీకా కవరేజీని సాధించలేకపోయింది. దీంతో వైరస్‌ వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

ADVERTISEMENT

వివరాలు 

1.8 కోట్ల మంది పిల్లలకు అత్యవసర టీకాలు

మరణాలసంఖ్య పెరుగుతుండటంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అత్యవసర జాతీయ టీకా కార్యక్రమాన్ని చేపట్టింది.

యునిసెఫ్‌,ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ),గావి వ్యాక్సిన్‌ అలయన్స్‌ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈప్రత్యేక టీకా కార్యక్రమంలో సుమారు 1.8కోట్ల మంది పిల్లలకు వ్యాక్సిన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇందుకోసం తాత్కాలిక కమ్యూనిటీ కేంద్రాలు,పాఠశాలలను వినియోగిస్తున్నారు.

అంతేకాకుండా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు టీకాలు వేస్తున్నారు.

మరోవైపు,మీజిల్స్‌ తీవ్రంగా ప్రభావితం చేసిన జిల్లాల్లోని వైద్యసదుపాయాలపై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది.

పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పిల్లలకు అవసరమైన అన్ని టీకాలను పూర్తి స్థాయిలో ఇప్పించాలని అధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

మీజిల్స్‌ నుంచి పిల్లలను రక్షించేందుకు సాధారణ టీకా కార్యక్రమంలో భాగంగా అందించే వ్యాక్సిన్లే అత్యంత సమర్థవంతమైన రక్షణ మార్గమని స్పష్టం చేస్తున్నారు.

ADVERTISEMENT