Trump-Netanyahu: నెతన్యాహుకు ట్రంప్ హెచ్చరిక.. 'బీబీ జాగ్రత్త.. లేకపోతే ఒంటరిగా మిగిలిపోతావు'!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కీలక హెచ్చరిక చేసినట్లు వెల్లడించారు. ఇరాన్తో పరిస్థితులు మరింత విషమించకుండా జాగ్రత్త పడాలని, ప్రతీకార దాడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆయన సూచించినట్లు తెలిపారు. సోమవారం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు జరిగిన సమయంలో ట్రంప్ నేరుగా నెతన్యాహుతో మాట్లాడినట్లు మీడియాకు వెల్లడించారు. బీరుట్లోని హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరపడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం టెల్అవీవ్పై క్షిపణులతో ఎదురుదాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాలు
ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఏకాకిగా మారే ప్రమాదం
ఈ పరిణామాల మధ్య జోక్యం చేసుకున్న ట్రంప్.. నెతన్యాహుతో మాట్లాడిన సందర్భంగా ''బీబీ.. మీరు జాగ్రత్తగా ఉండండి'' అని సూచించినట్లు చెప్పారు. ఇరాన్పై సైనిక చర్యలను మళ్లీ ప్రారంభిస్తే ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఏకాకిగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఇరాన్తో దౌత్యపరమైన ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు కొత్తగా యుద్ధ పరిస్థితులు ఆటంకం కలిగిస్తాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకురావాలని పలు దేశాలు తనను కోరాయని, అందుకే ప్రతిదాడులను పరిమితం చేసేలా నెతన్యాహుతో చర్చించినట్లు చెప్పారు.
వివరాలు
ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్
ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ట్రంప్,నెతన్యాహు మరోసారి ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇరాన్ నుంచి ఇకపై దాడులు జరగవని స్పష్టమైన హామీ లభిస్తేనే వెనక్కి తగ్గే అంశాన్ని పరిశీలిస్తామని నెతన్యాహు తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు,ఇజ్రాయెల్ దాడులను నిలిపివేస్తే తాము కూడా ఘర్షణను మరింత విస్తరించబోమని ఇరాన్ అధికారులు మధ్యవర్తుల ద్వారా సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. కాగా,సోమవారం జరిగిన ఘర్షణల్లో అమెరికా సైన్యం నేరుగా పాల్గొనలేదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. అయితే,ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులను అడ్డుకునే విషయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలకు అమెరికా సైనిక బలగాలు సాంకేతిక సహాయం అందించినట్లు యూఎస్ రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.