Jaishankar: రష్యా నుంచి చమురు కొనడం ఆపితే యుద్ధం ఆగదు: జైశంకర్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపివేసినంత మాత్రాన ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే పరిస్థితి లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ ఘర్షణకు ముగింపు పలకాలంటే ఇరు దేశాలు చర్చలు, దౌత్యం, పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకుంటున్న అంశంపై అమెరికా, ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న జైశంకర్.. ఆ దేశ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక విషయాలపై మాట్లాడారు.
వివరాలు
భారత్కు ఉన్న వైఖరిని కూడా ఇతర దేశాలు గౌరవిస్తాయని ఆశిస్తున్న: జైశంకర్
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇంధన కొరత పరిస్థితులు నెలకొన్నాయని,ఈ నేపథ్యంలో 140 కోట్ల మంది భారతీయులకు అవసరమైన ఇంధనాన్ని అందించడంలో ఉన్న సవాళ్లను ఇతర దేశాలు అర్థం చేసుకోవాలని కోరారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో ఉక్రెయిన్కు ఒక స్పష్టమైన దృక్కోణం ఉంటుందని, దానిని భారత్ గౌరవిస్తుందని జైశంకర్ తెలిపారు.
అదే విధంగా ఈ అంశంపై భారత్కు ఉన్న వైఖరిని కూడా ఇతర దేశాలు గౌరవిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
"యుద్ధం ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఎవరో చమురు,అల్యూమినియం, ఖనిజాలు, లోహాలు లేదా ఎరువులు కొనడం లేదా కొనకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. వివాదానికి ముగింపు పలకాలంటే చర్చలు, దౌత్యం, సంప్రదింపుల ద్వారానే పరిష్కారం కనుగొనాలి" అని జైశంకర్ పేర్కొన్నారు.
వివరాలు
అమెరికా సెనేట్లో 100 శాతం వరకు సుంకాల ప్రతిపాదన
రష్యా నుంచి చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేలా రూపొందించిన బిల్లును గత నెలలో అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టారు.
అనంతరం సెనేట్ దానికి ఆమోదం తెలిపింది. రష్యాతో ఈ వాణిజ్యం కొనసాగడం వల్ల మాస్కో ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తోందని, దాని సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూరుతున్నాయని అమెరికా వాదిస్తోంది.
ఈ కారణంతోనే రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై అధిక పన్నులు విధించే చర్యలకు అమెరికా సిద్ధమవుతోంది.
వివరాలు
భారత్కు రష్యానే కీలక చమురు సరఫరాదారు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 2021లో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురులో రష్యా వాటా కేవలం 0.2 శాతంగా ఉండేది.
అయితే 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై దాడి ప్రారంభించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
పాశ్చాత్య దేశాలు రష్యాను బహిష్కరించడంతో పాటు మాస్కోపై ఆంక్షలు విధించాయి.
దీంతో తక్కువ ధరకు లభించిన రష్యా ముడి చమురుకు భారత్ అతిపెద్ద కొనుగోలుదారుల్లో ఒకటిగా మారింది.
భారత్ తనకు అవసరమైన ముడి చమురులో సుమారు 88 శాతాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది.
వివరాలు
భారత్కు రష్యానే కీలక చమురు సరఫరాదారు
ఈ ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను తయారు చేస్తున్నారు.
భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో రష్యా వాటా ప్రస్తుతం గణనీయంగా పెరిగింది.
మొత్తం దిగుమతుల్లో 40 శాతానికి పైగా రష్యా నుంచే వస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
క్లెప్లర్ డేటా ప్రకారం.. ఆగస్టులో భారత్ రష్యా నుంచి రోజుకు సుమారు 21 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది.
దీంతో రష్యా చమురు దిగుమతులపై భారత్ వైఖరి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.