China: చైనాలో 5.2 తీవ్రతతో భూకంపం.. ఇద్దరి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. భూకంప ప్రభావంతో లియుజౌ నగరంలో 7 వేల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలను అధికారులు పూర్తిచేశారు. ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించిన వివరాల ప్రకారం, శిథిలాల కింద చిక్కుకున్న 91 ఏళ్ల వృద్ధుడిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. ఈ ప్రమాదంలో 63 ఏళ్ల వ్యక్తి, 53 ఏళ్ల మహిళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వారు భార్యాభర్తలని వెల్లడించారు. ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
వివరాలు
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన అధికారులు
భూకంపంలో గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారందరూ ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున లియుజై ప్రాంతంలో పలు పదమూడు అంతస్తుల భవనాలు కూలిపోయాయి. భూకంప ప్రభావంతో కొండచరియలు విరిగిపడటంతో అనేక మార్గాలు మూసుకుపోయాయి. ఎత్తైన భవనాల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీయడం, కొన్ని ఇళ్లు క్షణాల్లో కూలిపోవడం అక్కడి నిఘా దృశ్యాల్లో నమోదైంది. రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.