Pentagon report: అరుణాచల్ చైనా 'కోర్ ఇంట్రెస్ట్'లో భాగమే: పెంటగాన్ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా కాంగ్రెస్కు సమర్పించిన తాజా నివేదికలో పెంటగాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ను తమకు రాజీపడలేని ప్రధాన ప్రయోజనాల్లో ఒకటిగా చైనా చూస్తోందని స్పష్టం చేసింది. 2049 నాటికి తన పాత వైభవాన్ని తిరిగి సాధించడమే లక్ష్యంగా చైనా ముందుకెళ్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా తన నాయకత్వ ప్రభావాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతో బీజింగ్ ఉన్నట్లు వెల్లడించింది. తైవాన్, సెంకాకు దీవులతో పాటు భారత్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ కూడా చైనా విస్తృత జాతీయ భద్రతా వ్యూహాల్లో భాగమైందని వివరించింది.
వివరాలు
చైనా మూడు ప్రధాన ప్రయోజనాలు
జాతీయ పునరుజ్జీవన ప్రణాళికలో భాగంగా తైవాన్ వంటి కీలక భూభాగాలను తమ పరిధిలోకి తెచ్చుకోవడం అత్యంత అవసరమని బీజింగ్ భావిస్తున్నట్లు పెంటగాన్ నివేదిక తెలిపింది. ఈ పునరుజ్జీవన లక్ష్యాన్ని సాధించేందుకు చైనా మూడు ప్రధాన ప్రయోజనాలను ముందుంచుకున్నట్లు పేర్కొంది. అందులో చైనా కమ్యూనిస్టు పార్టీపై పూర్తి నియంత్రణను కొనసాగించడం,దేశ ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేయడం,అలాగే సార్వభౌమాధికారం,ప్రాదేశికహక్కుల వాదనలు కాపాడుకోవడం వంటి అంశాలు ఉన్నట్లు వెల్లడించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ తన పాలనకు దేశంలోనూ,విదేశాల్లోనూ ఎదురయ్యే విమర్శలను తీవ్ర ముప్పుగా భావిస్తూ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. హాంకాంగ్,షింజియాంగ్,టిబెట్,తైవాన్ వంటి ప్రాంతాల్లో చైనాకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నేతలు, పార్టీలను బాహ్య శక్తుల ప్రభావానికి లోనైన వేర్పాటువాదులుగా బీజింగ్ ముద్ర వేస్తోందని తెలిపింది.
వివరాలు
అమెరికా-భారత్ సంబంధాలు మరింత బలపడకుండా జాగ్రత్తలు
భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తగ్గింపు చర్యలుగా కుదిరిన గస్తీ ఒప్పందాన్ని కూడా పెంటగాన్ తన నివేదికలో ప్రస్తావించింది. గత ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్,భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ, రెండు దేశాల సంబంధాల పునరుద్ధరణకు ఆరంభంగా మారిందని పేర్కొంది. ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతలు తగ్గిన పరిస్థితిని ఉపయోగించుకుని భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలని చైనా భావిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో అమెరికా-భారత్ సంబంధాలు మరింత బలపడకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని అభిప్రాయపడింది. ఇక, చైనా చర్యలు మరియు దావాలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోన్న విషయాన్ని కూడా నివేదిక గుర్తు చేసింది.